భీమవరం (ప్రకాశంచౌక్): సమాజంలో మార్పు కోసం, మంచి వైపు నడిపేలా నాటక రంగం ప్రభావితం చేస్తుందని పట్టణ కళాకారుల సంఘం కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల సీతారామ ప్రసాద్ అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్లో శుక్రవారం పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని 24 మంది నాటక, సంగీత, నృత్య కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నాటకాల ప్రాముఖ్యతను నేటి యువతరానికి తెలియజేయాలని, ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని అన్నారు. శ్రీవిజయ దుర్గ ఆర్ట్స్ థియేటర్ వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు, నాటక కళాకారులు పులగం నరసింహారావు, కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లా డుతూ నాటకాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని, తీర్థాలు, ఉత్సవాల్లో రంగస్థలానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అనంతరం 24 మంది నాటక, సంగీత, నృత్య కళాకారులకు సత్కరించారు. కార్యక్రమంలో కళాకారులు కాటి వెంకటరత్నం, షేక్ వల్లి, ఆదినారాయణ, దాశరధి శ్రీనివాస్, గొన్నాబత్తుల మల్లేశ్వరరావు, కలిగొట్ల గోపాల శర్మ, డా ఎస్ఎస్ రాజు, డా నాగేశ్వరరావు, కొత్తపల్లి త్రినాధ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కళాకారులను సత్కరిస్తున్న దృశ్యం


