పెదపాడు: నిద్రమత్తులో లారీపై నుంచి కిందపడి క్లీనర్ మృతి చెందిన ఘటన పెదపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని ఏపూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మదనపల్లి గ్రామం అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్ తాజుద్ధీన్(40) మేతలు లోడు చేసుకునేందుకు లారీ డ్రైవర్ షేక్ అబ్దుల్ షుకూర్తో కలిసి ఏపూరు స్నేహ ేఫీడ్స్ వద్దకు వచ్చాడు. రాత్రి 8.50 నిమిషాలు కావడంతో స్నేహ ఫీడ్స్ సిబ్బంది రేపు ఉదయం లోడు చేస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాంగణంలో పార్కింగ్ చేసి నిద్రించారు. సుమారు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద ఎత్తున సౌండు రావడంతో డ్రైవర్ షుకూర్ చూసేసరికి క్లీనర్ తాజుద్దీన్ లారీపై నుంచి కింద పడి రక్తపు గాయాలతో ఉన్నాడు. వెంటనే అతడిని గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తాజుద్ధీన్ తమ్ముడు ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగిరిపల్లి: బంగారం చోరీ కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శుభశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శోభనాద్రమ్మ ఇంట్లో గతేడాది అక్టోబర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి 27 గ్రాముల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన చదల వెంకటేశ్వరమ్మ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మంగళవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమె నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అత్తిలి : ఆరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో బోటనీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న చల్లా హేమలత చండీఘర్లో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు, రజిత పతకాలను సాధించారు. 40 నుంచి 50 సంవత్సరాల కేటగిరీలో ఆర్టిస్టిక్ ఫెయిర్లో బంగారు పతకాన్ని, రిథమిక్ పెయిర్లో సిల్వర్ పతకాన్ని ఆమె సాధించారు. జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించిన హేమలతను ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు అభినందించారు. తన విజయానికి భర్త రామకృష్ణ ఎంతో సహకరించారని హేమలత తెలిపారు.


