నూజివీడు: వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాయింట్ ఫోరం ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూజివీడు బ్రాంచి వద్ద ఆందోళన నిర్వహించారు. సొసైటీల సీఈఓలు బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ఖర్చులు పెరిగి జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు అక్కినేని రాజా, కృష్ణా జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌతం నాయక్ పాల్గొన్నారు. వీరికి మద్దతుగా పీఏసీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నీలం నాగేశ్వరరావు, అక్కినేని ప్రసాద్, పసుపులేటి దుర్గారావు మద్దతు తెలిపారు.
ఉండి: రొయ్యల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే హెడ్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు పత్రికా ప్రకటనలో బుధవారం తెలిపారు. జాతీయ మత్స్య అబివృద్ధి మండలి హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణలో రొయ్యల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, చెరువు తయారీ, పిల్ల ఎంపిక, మేత, వ్యాధులు, నూతన యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. సమాచారం కోసం కేవీకే మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావును సంప్రదించాలన్నారు.


