ద్వారకాతిరుమల: చెడు వ్యసనాలకు బానిసలై గేదెలను అపహరించిన నలుగురు వ్యక్తులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిరుమలంపాలెంకు చెందిన బోడ బ్రహ్మయ్య, అదే పంచాయతీ పరిధిలోని పావులూరివారిగూడెంలోని కొబ్బరి తోట షెడ్డులో తన రెండు గేదెలు, ఒక లేగ దూడను కట్టి ఉంచాడు. గత నెల 26న గుర్తు తెలియని వ్యక్తులు వాటిని దొంగిలించారు. బాధిత రైతు అదే రోజు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, భీమడోలు సీఐ పి.కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై సుధీర్ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారణ నిర్వహించారు. ఈ విచారణలో గేదెలను దొంగిలించింది తిరుమలంపాలెంకు చెందిన మిడతా వెంకన్న, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన కడారి కృష్ణ, కడారి సురేష్, గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన ఉప్పాటి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.


