యుద్ధం కారణంగా నిలిచిన ఎగుమతులు
● ధరలు తగ్గడంతో రైతులు, వ్యాపారుల గగ్గోలు
● రూ.22 వేల నుంచి రూ.13 వేలకు పతనం
యుద్ధం కారణంగా కొబ్బరి ఎగుమతులు తగ్గడంతో ధరలు కూడా పతనమయ్యాయి. గ తంలో రైతుల నుంచి వెయ్యి కాయలు రూ.18 వేలకు పైగా కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.13 వేలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉగాది, శ్రీరామనవమి పండుగలతో ఆ మాత్రం ఎగుమతులు ఉన్నాయి. పండుగలు అయిపోతే ధరలు మరింత తగ్గే అవకాశముంది.
– చివటపు నాగేశ్వరరావు,
కొబ్బరికాయల వ్యాపారి
భీమవరం: పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలోని రైతులు, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొబ్బరి, రొయ్యల ధరలు పతనం కాగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది, శ్రీరామనవమి పండుగలకు కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించిన రైతులు, వ్యాపారుల ఆశలు ఆవిరయ్యాయి.
25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు : జిల్లాలో రైతులు ఎక్కువగా వరి తరువాత కొబ్బరి ఆదాయంపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో సు మారు 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగుచేస్తుండగా రైతులు చేలు, పుంత గట్లు, ఆర్అండ్బీ రోడ్డు వెంట, నివాస గృహాల పరిసరాల్లో కొబ్బరి పెంచడం పరిపాటి. కొబ్బరి ఆదాయం ద్వారా అనేక కుటుంబ అవసరాలు తీరుతున్నాయి. కొంతకాలంగా కొబ్బరి ధరలు తక్కువగా ఉండడం, కొబ్బరి దింపు, ఒలుపు ఖర్చులు పెరగడం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో గత ఏడాదిలో కొబ్బరికి మంచి గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో గతంలో ఎన్నడూలేనంతగా వెయ్యికాయల ధర రూ.22 వేల వరకు పలకడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. మహాశివరాత్రి, సమ్మక్క, సారక్కల జాతర వంటి పండుగలకు కొబ్బరి పెద్ద ఎత్తున ఎగుమతులు కావడమేగాక మంచి ధర లభించడం రైతులకు ఊరటనిచ్చింది.
కొబ్బరి పంటను కేరళ, అస్సాం, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా పండిస్తారు. కేరళ, కర్నాటక, అస్సాం వంటి రాష్ట్రాల కొబ్బరి నాణ్యత అధికంగా ఉండడంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ కొబ్బరి దేశంలోనే ఎక్కువగా వినియోగిస్తారు. ఇలాంటి తరుణంలో యుద్ధం కారణంగా కొబ్బరి ఎగుమతులు నిలిచిపోవడంతో కేరళ, అస్సాం, కర్నాటక వంటి రాష్ట్రాల కొబ్బరి దేశంలోనే వినియోగించడంతో మన రాష్ట్రంలోని కొబ్బరికి గిరాకీ తగ్గింది.
రూ.6 వేల వరకు తగ్గిన ధర : మొన్నటి వరకు వెయ్యి కాయల కొబ్బరి ధర రూ.18 వేల పైగా ఉండగా యుద్ధం దెబ్బతో రూ.12 వేలకు పడిపోయింది. పాలకొల్లు నుంచి ప్రతి రోజూ 50 లారీల కాయలు ఎగుమతి కాగా ప్రస్తుతం 20 లారీలు కూడా వెళ్లడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


