సరిపల్లిలో భారీ చోరీ
కొయ్యలగూడెం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలు ఆగంతకులు ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలో ఉన్న నగలు నగదు అపహరించిన సంఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని సరిపల్లి గ్రామానికి చెందిన మేరీ కుమారి ఉదయం సుమారు పదిన్నర సమయంలో సమయానికి వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వచ్చింది. వచ్చేసరికి ఇంటి తలుపులు పగులకొట్టి ఉండడంతో లోపలికి వెళ్ళి చూడగా బీరువా తలుపు తీసి సామాన్లు చిందరవందరగా పడి ఉన్నట్లు తెలిపింది. లోపల దాచిన సుమారు రూ.4.30 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు 12 తులాల వెండి పట్టీలు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
జంగారెడ్డిగూడెం: జాతరకు వెళ్లి వచ్చేసరికి దుండగులు దోచేశారు. బాధితుడు మేడూరి రవితేజ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రవితేజ, స్థానిక బైనేరు వాగు వద్ద ఉన్న శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఏరియా ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్ఎస్ నగర్లో ఉంటున్నారు. ఈ నెల 1న ఏలూరులో జరుగుతున్న జాతర మహోత్సవానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. సోమవారం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా, తలుపులు పగులగొట్టి ఉండటంతో రవితేజకు సమాచారం ఇచ్చింది. రవితేజ వచ్చి చూడగా, బీరువాలో ఉంచిన 3 కిలోల వెండి వస్తువులు, రూ. 50వేల నగదు, 10 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించాడు. చోరీకి గురైన వస్తువుల్లో సుమారు 2.50 కిలోల వరకు తాను పనిచేసే శివాలయంలోని దేవుడి వస్తువులని రవితేజ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించినట్లు రవితేజ తెలిపారు.
ఉండి: ఉండిలో మైనర్పై అత్యాచార ఘటనపై నమోదైన పోక్సో కేసులో భాగంగా నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2023 డిసెంబరులో ఉండిలోని పడవలవాని పేటలో మైనర్ బాలికపై వరుసకు మేనత్త కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పటి మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ నున్న మురళీకృష్ణ విచారణ చేపట్టి నాగాంజనేయులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో జడ్జి బీ లక్ష్మీనారాయణ జీవితకాలం జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించినట్లు ఎస్సై తెలిపారు.
భీమవరం: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశాజనకంగా లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బీవీ నారాయణ సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను నిబంధనల్లో ఎలాంటి మార్పు లేకపోవడం నిరాశపర్చిందని, కొత్త పన్ను నిబంధనల్లో పొదుపు, ఇతర తగ్గింపులకు అవకాశం లేకపోవడం దారుణమన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచాలన్నారు.
సరిపల్లిలో భారీ చోరీ


