కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
టి.నరసాపురం: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిలు అన్నారు. టి.నరసాపురం ఎస్ఎస్ కన్వెన్షన్లో సోమవారం సాయంత్రం జరిగిన పోలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని పార్టీ ముందుకు సాగనుందని కార్యకర్తలకు భవిష్యత్తులో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కార్యకర్తల ద్వారానే జరుగుతుందన్నారు. కార్యకర్తలు బలోపేతం కావడానికి భవిష్యత్తులో పార్టీ దోహదపడుతుందన్నారు.
రాష్ట్రంలో ఆటవిక పాలన: బాలరాజు
సంస్థాగత నిర్మాణం పారదర్శకంగా రచ్చబండ పెట్టి చేయాలని సూచించారు. మెజార్టీ సభ్యులు కోరిన వారిని కమిటీల్లో సభ్యులుగా నియమించుకోవాలన్నారు. ప్రభుత్వం అసత్య ప్రచారాలను మానుకోవాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ళల్లో తట్టా బుట్టా సర్ధుకుని పోతోందన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లను ధ్వంసం చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఈ నెల 10 లోపు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలా చేయడం ద్వారా నియోజకవర్గానికి 8 నుంచి 10 వేల మంది కార్యకర్తలు అనుబంధ సంఘాల్లో సభ్యులుగా ఉంటారని వివరించారు. కార్యక్రమంలో టి.నరసాపురం మండల కన్వీనర్ శ్రీను రాజు, మచిలిపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ సామంతపూడి బాల సూర్యనారాయణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు, కొత్త ప్రకాష్బాబు, చిక్కాల దుర్గాప్రసాద్, ఆరేటి సత్యనారాయణ, పి.అభిషేక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత, తుమ్మలపల్లి గంగరాజు, గంజిమాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి


