అక్షరాస్యత పెంపునకు చర్యలు
ఏలూరు(మెట్రో): అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యత పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శుక్రవారం అక్షర ఆంధ్ర, యూనిఫైడ్ ఫామిలీ సర్వే, పీ–4 తదితర కార్యక్రమాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని 97,200 మందికి అక్షరాస్యత, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత అందించడం లక్ష్యంగా ని ర్ణయించామన్నారు. యూనిఫైడ్ ఫామిలీ సర్వే పనులు వేగవంతం చేయాలని, పీ–4 ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీహరి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఆడిటర్ భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు ఛేదించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఆడిటర్ వడ్లమూడి ఉమమహేష్ను పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి భారీ ఎత్తున సుమారు రూ.7 కోట్ల విలువైన 4.490 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలు 378 మంది ఖాతాదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ బంగారు ఆభరణాలను కనకదుర్గ ఫైనా న్స్ ప్రధాన కార్యాలయ ప్రతినిధులకు శుక్రవా రం అందజేశారు. వందలాది మంది ఖాతాదారులకు చెందిన బంగారు ఆభరణాలను తిరిగి రికవరీ చేయటంలో పోలీసుల కృషిని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు అభినందించారు. జంగారెడ్డిగూడెం ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర, ఏలూరు మహిళ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం ఉన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లా పరిధిలో బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించినట్టు జిల్లా పర్యవేక్షణాధికారి టి.జ్యోతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు సహా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి వచ్చేనెల 13లోపు ఏలూరులోని కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జ్యోతి సెల్ 7780399779, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణి సెల్ 89191 60257 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (బ్రిడ్జ్కోర్సు, ఆన్జాబ్ ట్రైనింగ్) విద్యార్థులకు ప్రాక్టికల్స్ శుక్రవారం కొనసాగాయి. జిల్లాలోని 34 కేంద్రాల్లో ఉదయం 2,320 మందికి 2,286 మంది, మధ్యాహ్నం 2,502 మందికి 2,457 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను తెలిపారు.
ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ స్థానిక డీమార్ట్ సెంటర్లో గాంధీజీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. జీ రాం జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని దీనిపై రాష్ట్రంలో ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా సహాయ కార్యదర్శి గోలిమే బాలయేసు, మండల కార్యదర్శి పొటేలు పెంటయ్య, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అక్షరాస్యత పెంపునకు చర్యలు


