స్వామి చందాల సొమ్ము ఎక్కడ?
ఆగిరిపల్లి: 22 ఏళ్లుగా అన్నదాన కమిటీ సభ్యులు భక్తుల నుంచి చందాలు వసూలు చేసి మంత్రి కొలుసు పార్థసారథికి అందించిన రూ.28.50 లక్షలు ఎక్కడ ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. గురువారం స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల క్రితం అన్నదాన కమిటీ నిర్వాహకులు మంత్రి పార్థసారథికి నగదు రూపంలో రూ.15.50 లక్షలు, చెక్కు ద్వారా రూ.13.00 లక్షలు అందజేశారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆ నగదు ఎక్కడుందని, దేవస్థానం ఖాతాలో ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పార్థసారథి సమాధానం చెప్పాలన్నారు. వాస్తవంగా నిర్వాహకులు ఇవ్వాల్సింది రూ.56 లక్షలు కాగా రూ.28.50 లక్షలు ఇచ్చేందుకు ఆగిరిపల్లి గ్రామస్తులు ఒప్పుకున్నారని, ఆ నగదును మంత్రి దగ్గర పెట్టుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 25న జరిగిన అన్నదాన కార్యక్రమంలో వసూలు చేసిన విరాళాల వివరాలను ఆలయ ఈఓ తెలియజేయకుండా అన్నదాన కమిటీ సభ్యులతో కుమ్మక్కవడం ఏంటని మండిపడ్డారు. భక్తు లు ఇచ్చిన విరాళాలు రూ.4.10 లక్షలు మాత్రమే జమ చేయడం ఏంటని, మిగతా నగదు ఎక్కడుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు వెల్లడించకుంటే దేవదాయ కమిషనర్కు, దేవదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని వెంకట ప్రతాప్ అప్పారావు హెచ్చరించారు.


