కబడ్డీ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కాంస్య పతకం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థి వై శ్రీనివాస్ కబడ్డీ పోటీలో ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించాడు. విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో ఈనెల 21 నుంచి 26 వరకు జరిగిన మూడవ జాతీయ పురుషుల పారా కబడ్డీ పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించి కాంస్యం పతకం సాధించడం విశేషం. శ్రీనివాస్ను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి బీ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సుబ్బలక్ష్మి తదితరులు బుధవారం అభినందించారు.
ఆకివీడు: స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దేవర కొండ ఏడుకొండలు (58) చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు బుధవారం తెలిపారు. గత నెల 31న సెలవుపై తన స్వగ్రామం బాపట్ల వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని, 2023 నుంచి ఆకివీడు పోలీస్ స్టేషన్లోనే ఆయన విధుల్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై వివరించారు.
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బుధవారం ద్వారకాతిరుమల వెళ్లి మధ్యాహ్నాం స్థానిక కొత్తబస్టాండ్కు తిరిగి వచ్చింది. డ్రైవర్ వాహనాన్ని బస్టాండ్లో ఓ పక్కగా నిలుపుదల చేసి భోజనం చేసేందుకు వెళ్లారు. కొద్ది సేపటికి బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ముందు జాగ్రత్తగా బకెట్లతో నీటిని చల్లి పొగను కట్టడి చేశారు. ఇంజన్ వద్ద ఉన్న క్వాయిల్ వైర్లు డైరెక్ట్ కావడంతో పొగలు వచ్చాయని, వెంటనే బస్సును డిపోకు తరలించి క్వాయిల్ మార్చడం జరిగిందని డీఎం గంగాధరరావు తెలిపారు.
బుట్టాయగూడెం: జిల్లాలోని మూడు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పీఓ కె. రాములు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుట్టాయగూడెం గురుకుల బాలికలు, కేఆర్పురం, జీలుగుమిల్లి బాలురు గురుకులాల్లో ఒక్కో పాఠశాలలో 80 ఖాళీలు ఉండగా వాటిలో 2 ఓసీ, 10 ఎస్సీ, 4 బీసీ, 2 ఏఈక్యూ, 55 ఎస్టీ, 2 పీసీటీ ఏనాది పీహెచ్సీ, 5 పీటీజి చొప్పున ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 28వ తేదీ లోగా ఆన్లైన్ చేసుకోవాలని కోరారు. అలాగే ఈ పాఠశాలల్లో ఏప్రిల్ 4వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
పెదవేగి : పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసి ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరచిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిిపిన వివరాలు ఇవి. బుధవారం పెదవేగి మండలం, రామచంద్రపురం గ్రామం లో కర్ణాటక మధు అనే వ్యక్తిని పాత గొడవలు పురస్కరించుకుని నక్క రాము అనే వ్యక్తి కత్తితో తీవ్రంగా నరికాడని, ఈ మేరకు వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సమాచారం.
భర్తపై కేసు నమోదు
యలమంచిలి: స్థానిక అంబాల చెరువుగట్టుకు చెందిన చదలవాడ సుశీల (51)ను ఆమె భర్త సుబ్బారావు ఈ నెల 26న తలపై కర్రతో కొట్టడంతో రక్త గాయమైంది. ఆమె పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కర్ణీడి గుర్రయ్య బుధవారం తెలిపారు.
కబడ్డీ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కాంస్య పతకం
కబడ్డీ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కాంస్య పతకం
కబడ్డీ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కాంస్య పతకం


