ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రా
ష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్టు ఆ సంఘ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీబీవీఎన్ఎల్ నారాయణ, కేఆర్ పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు చెల్లించాలనేవి తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మెమో. 57 మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అనులు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు తలపెట్టిన దశలవారీ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 10వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన విజయవాడలో బహిరంగ సభ, నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.


