బ్యాంకు ఉద్యోగుల నిరసన
ఏలూరు (టూటౌన్): వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె మంగళవారం జరిగింది. ఆర్ఆర్ పేట శ్రీనివాస్ థియేటర్ రోడ్డులోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళే శ్రీనివాసరావు, రీజనల్ సెక్రటరీ విమల్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా గుర్తించి, శని, ఆదివారాలు సెలవులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. శనివారం పూర్తిగా బ్యాంకు ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులను ప్రైవేటు పరం చేయడంపై ఉన్న శ్రద్ధ బ్యాంకు ఉద్యోగులపై లేదని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె.జె సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు.


