వెనుకబడిన రిక్షా చక్రం
● ఆటోల జోరుతో అగమ్యగోచరంగా రిక్షా కార్మికుల జీవనం
● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
చింతలపూడి: ఒకప్పుడు ఊరిలో అయినా, పట్టణంలో అయినా సామాన్యుడి రాజవాహనం రిక్షా రైలు దిగినా, బస్సు దిగినా ప్రయాణికులు ముందుగా వెతికేది రిక్షా కార్మికుల కోసమే. కానీ కాలక్రమేణా మారుతున్న రవాణా రంగం, పెరిగిన సాంకేతికత ఆ పేద కార్మికుల పొట్ట కొడుతోంది. వేగంగా దూసుకెళ్తున్న ఆటోలు, క్యాబ్ ల మధ్య రిక్షా చక్రం వెనకబడిపోతోంది.
అప్పట్లో గిరాకీ.. ఇప్పుడు నిరీక్షణ!
రెండు దశాబ్దాల క్రితం వరకు రిక్షా కార్మికులకు చేతినిండా పని ఉండేది. సినిమా హాల్స్, మార్కెట్లు, పాఠశాలలకు వెళ్లేవారు రిక్షాలనే ఆశ్రయించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. ప్రతి గల్లీలోనూ ఆటోలు అందుబాటులోకి రావడంతో రిక్షా ఎక్కేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రజలు వేగానికి అలవాటు పడటంతో, నెమ్మదిగా వెళ్లే రిక్షాల కంటే ఆటోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా కనీసం వంద రూపాయల సంపాదన కూడా రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గతంలో వందల సంఖ్యలో ఉండే రిక్షా లు నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి.
ముదిరిన వయసు.. తీరని కష్టం
రిక్షా తొక్కడం అనేది శారీరక శ్రమతో కూడిన పని. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నవారిలో ఎక్కువ శాతం 50 ఏళ్లు పైబడిన వారే. వేరే పనులు చేయలేక, కుటుంబ పోషణ కోసం వయసు పైబడినప్పటికీ ఎండనక, వాననక కష్టపడుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో పోల్చితే వారి సంపాదన కనీసం ఒక్క పూట గడవడానికి కూడా సరిపోవడం లేదు. దుర్భర స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రిక్షా కార్మికులు కోరుతున్నారు.
వెనుకబడిన రిక్షా చక్రం


