ఆస్తి వివాదంలో వ్యక్తిపై దాడి
ముసునూరు: అధికార పార్టీ వత్తాసుతో ముప్ఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూయజమానిపై దాడికి పాల్పడి గాయపరిచిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చింతలవల్లి గ్రామంలో బొద్దు కోళ్ళ సుందరరావు తల్లి పేరున డి–ఫారమ్ పట్టా భూమి మంజూరైంది. ఆ భూమిలో సుందరరావు కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన మందపాటి బెనర్జీ, అతని కుమారులు సురేష్, కిషోర్లు భూమి తమదంటూ పదే పదే బెదిరింపులకు దిగి, రెండేళ్ల క్రితం పత్తి పంటను నరికి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం బెనర్జీ కుటుంబం, ఏఎస్సై బేగ్, మహిళా పోలీసులు, సిబ్బంది, సర్వేయర్లతో కలిసి అక్కడకు వచ్చి భూమి కొలతలు అంటూ రాళ్లు పాతే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది మా పట్టాభూమి అని సుందరరావు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసుల సమక్షంలోనే బెనర్జీ అతని కుమారులు సుందరరావు కుటుంబ సభ్యులపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. సుందరరావు కుమారుడి సాయంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్నా వారు ప్రేక్షక పాత్ర వహించడంపై బాధితులు, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెనుమంట్ర: మోటార్సైకిల్ కారుని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మార్టేరు – పెంటపాడు స్టేట్ హైవే రోడ్డుపై ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఈ హేమంత్ కుమార్(22), ఎస్ బున్ని (22), ఈ.చాణిక్య (11), ఈ.కౌశిక్ (10) మోటార్సైకిల్పై పెనుమంట్రవైపు నుంచి అత్తిలి వైపు వెళ్తుండగా నత్తారామేశ్వరం పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న చిన్న కారును ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను హటాహుటిన తణుకులోని ప్రైవేట్ హాస్పటల్కు తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమీ తెలియ రాలేదని పోలీసులు చెబుతున్నారు.
ఆస్తి వివాదంలో వ్యక్తిపై దాడి


