మళ్లీ పంజా విసిరిన పెద్ద పులి
బుట్టాయగూడెం: పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. ఆదివారం వేకువజామున బుట్టాయగూడెం మండలం రావిగూడెంకు చెందిన తెల్లం వెంకటేష్ అనే గిరిజనుడికి చెందిన గేదె దూడపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. దీనితో సుమారు 9 పశువులపై ఇప్పటివరకూ పులి దాడి చేసి చంపింది. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వేస్తున్న వ్యూహాలకు, అంచనాలకి చిక్కకుండా పెద్దపులి సంచరిస్తోంది. వాస్తవానికి గుర్రప్పగూడెం, మెట్టగూడెం, కోటనాగవరం గ్రామాల్లో గేదెలపై, ఆవులపై దాడి చేసిన పెద్దపులి మళ్లీ అదే ప్రాంతానికి వస్తుందని భావించిన ఫారెస్ట్, పాపికొండల అభయారణ్యం వైల్డ్లైఫ్ సిబ్బంది సుమారు 20 ట్రాప్కెమెరాల వరకూ రాత్రంతా ఏర్పాటు చేశారు. అయితే వారు ఊహించిన దానికి భిన్నంగా పెద్దపులి కంసాలికుంట మీదుగా అల్లికాల్వ దాటుకుంటూ రావిగూడెం చేరుకుని అక్కడి నుంచి బిల్లిమిల్లి మీదుగా దిప్పకాయలపాడు చేరుకుంది. పెద్దపులి ఎప్పుడైనా తాను పర్యటించిన ప్రాంతాల్లోనే మళ్లీ పర్యటించే అవకాశం ఉంటుందని భావిస్తున్న తమకు అంతు చిక్కకుండా పెద్దపులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. గిరిజన గ్రామాల ప్రజలను అల్లాడిస్తున్న పెద్దపులిని పట్టుకుని ఈ ప్రాంత ప్రజలను భయాందోళన నుంచి బయటపడేయాలని రావిగూడెం గ్రామస్తులు కోరుతున్నారు.


