29 నుంచి నారసింహుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్.జగన్నాధపురంలో సుందరగిరిపై కొలువైన స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 29న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను వచ్చేనెల 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. 29న ఉదయం 10.15 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 30న ఆలయంలో నిత్య పూజలు, హోమాలు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు జరుగుతాయి. 31న ఉదయం 11.10 గంటలకు కొండ కింద కల్యాణ మండపంలో దివ్యకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వచ్చేనెల 1న సాయంత్రం 6.30 గంటల నుంచి గరుడ వాహనంపై గ్రామోత్సవం, 2న పంచామృతాభిషేకాలు, చందనోత్సవం, పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ వేడుకలు జరుగుతాయి. 3న జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు.


