ఓటు హక్కు వినియోగం మన బాధ్యత
ఏలూరు(మెట్రో): ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్స్టేషన్కు రాలేని వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యావంతులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం ద్వారా 85 నుంచి 90 శాతం వరకు పోలింగ్ జరిగితే ఉత్తమమైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె.సుబ్బారావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పాల్గొన్నారు.


