క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా
దెందులూరు: దెందులూరులోని ఆయిల్ ఫ్యాక్టరీకి ఎడిబుల్ ఆయిల్ తరలిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆదివారం మధ్యాహ్నం దెందులూరు గ్రామంలో బోల్తా పడింది. ఎస్సై రాచమల్లు శివాజీ ఘటనా స్థలానికి చేరుకుని ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు, పాదచారులకు, స్థానిక రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 28 టన్నుల క్రూడ్ ఆయిల్ రోడ్డుపై ఒలికిపోయింది. ఇది మండే స్వభావం లేని ఆయిల్ కావడంతో ప్రజలు భయపడనవసరం లేదని ఎస్సై శివాజీ తెలిపారు. ఆ రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్సై సూచించారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈనెల 27 నుంచి 31 వరకు క్వాంటం టెక్నాలజీపై వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఏఓ బీ లక్ష్మణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వర్క్షాపునకు న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్లో గతంలో శాస్త్రవేత్తగాను, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పూర్వ డైరెక్టర్గా పనిచేసిన ఆచార్య జీ భగవన్నారాయణ రీసోర్స్ పర్సన్గా వ్యవహరించనున్నారు. వర్క్షాపులో 74 మంది అధ్యాపకులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి 118 మంది విద్యార్థులు, ఒంగోలు ట్రిపుల్ ఐటీ నుంచి 32 మంది, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ నుంచి 10 మంది, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుంచి ఆరు మంది విద్యార్థులు పాల్గొనేందుకు తమపేర్లను రిజస్టర్ చేసుకున్నారు.
ముసునూరు: గ్రామ ప్రజల అవసరాల కోసం తరాల నాడు తవ్వించి ఇచ్చిన చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చింతలవల్లిలో 200 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దాత నాగళ్ళ రామయ్య గ్రామ అవసరాల కోసం తన భూమిలో సొంత నిధులతో చెరువు తవ్వించి దానంగా ఇచ్చారు. రెండేళ్లుగా దాతకు ఏ మాత్రం సంబంధం లేని అధికార పార్టీకి చెందిన కొందరు కబ్జాదారులు అధికారుల ద్వారా రెవెన్యూ రికార్డుల్లో ఆన్లైన్ చేయించుకొని, ఆ రోజు నుంచి పనిగట్టుకొని చెరువును భౌతికంగా ఆక్రమించే పనిలో పడ్డారు. కాగా కబ్జాదారులు తమకు పట్టాలు ఉన్నాయని, ఆన్లైన్లో నమోదయ్యాయని చెబుతూ శనివారం రాత్రి కబ్జాకు దిగి, చెరువు కట్టను తవ్వించారు. ఆ మట్టి, గ్రావెల్తో చెరువును పూడ్చడం ఆరంభించగా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అనంతరం ముసునూరు తహసీల్దార్కు, నూజివీడు సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి, పరిష్కారం కోరారు. ఆదివారం మండలంలోని అఖిల పక్ష పార్టీల నేతలు చెరువును పరిశీలించి, సంఘీభావం తెలిపి, చెరువు పూడ్చి వేతను ఆపి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కుక్కునూరు: సారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు పోలీసులు దాడిచేసి 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, మండలంలోని కివ్వాక గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో సారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. అటవీప్రాంతంలో సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
పెదవేగి : వ్యక్తి అదృశ్యంపై పెదవేగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన ఉండవల్లి శేషగిరిరావుకు అతని భార్యకు మధ్య కుటుంబ వ్యవహారంలో సమస్యలు తలెత్తడంతో నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీ సాయంత్రం నుంచి ఇంటి వద్ద నుంచి కూడా కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శేషగిరిరావు కుమారుడు ఉండవల్లి శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా
క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా


