కొనసాగుతున్న పులి దాడులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో పులి దాడి చేసి చంపిన పశువులకు సంబంధించి వాటి యజమానులకు నష్టపరిహారం చె ల్లించాలని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాలుగు రో జులుగా ఈ పులి నాగులగూడెం, కోటనాగవరం, మెట్టగూడెం తదితర గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతోందని, పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమైనట్టు కనిపిస్తోందన్నారు. సకాలంలో పులిని బంధించి ఉంటే పశువులు మృత్యువాత పడేవి కావన్నారు. ఇప్పటివరకూ సుమారు 9 పశువుల వరకు పశువులను పులి వేటాడి చంపిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిళ్లు బయటకు రావద్దని సూచించారు.
బుట్టాయగూడెం: ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఎన్నడూలేని విధంగా పెద్దపులి సంచరిస్తూ పశువులపై పంజా విసురుతోంది. శనివారం వేకువజామున గుర్రప్పగూడెంలో లేగ గేదె దూడ, కోటనాగవరంలో మరో లేగ దూడ, గేదైపె దాడి చేసి హతమార్చింది. ఇలా కనిపిస్తున్న పశువులపై దాడి చేస్తూ ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా సంచరిస్తోంది. ఇదిలా ఉండగా పులిని తిరిగి అడవిలో పంపించేందుకు లేదా పులి నుంచి పశువులను, ప్రజలను రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు విమర్శిస్తున్నారు.
నాలుగు రోజులుగా..
పశువుల మందలపై దాడి చేస్తున్న పులిని మీరు బంధిస్తారా లేక మాకు అప్పగిస్తారా అంటూ గిరిజనులు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులుగా భయంతో బతుకుతున్నామని, ఎన్నిరోజులు బయటకు రాకుండా ఉంటామని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్లకు చేరుకుంటున్నామని, తెల్లవారిన 8 గంటల తర్వాత గానీ బయటకు రావడం లేదని చెబుతున్నారు. కూలీలు పను లు మానేసే పరిస్థితి ఉందని, ప్రస్తుతం ముమ్మరంగా మొక్కజొన్న, వర్జీనియా పొగాకు పను లు ఉన్నాయని అంటున్నారు. పులి కారణంగా ఎవరూ పొలానికి వెళ్లలేని పరిస్థితులు నెలకొ న్నాయని చెబుతున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పులిని త్వరితగతిన అడవిలోకి పంపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అంతర్వేదిగూడెం సర్పంచ్ జోడే సత్య దుర్గాప్రసాద్ కోరుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
పోలవరం రూరల్: పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. పులి కదలికలపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
కొనసాగుతున్న పులి దాడులు


