టెక్నీషియన్ ఆత్మహత్య ఘటనలో ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసత్రిలోని అపోలో డయాలసిస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆత్మహత్య ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురానికి చెందిన సుధాకర్ డయాలసిస్ సెంటర్లో ఔట్సోర్సింగ్ విధానంలో సీనియర్ టెక్నీషియన్, సెంటర్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. 2023లో డయాలసిస్ చికిత్సకు వచ్చే ఓ రోగి కుమారుడు కొమ్ము అజయ్బాబు, సెంటర్లో ఆయా యరమాల కరుణకుమారితో చనువుగా ఉండటంతో సుధాకర్ మందలించాడు. దీంతో వీరిద్దరూ కక్ష పెంచుకుని సుధాకర్పై అక్రమ కేసు పెట్టడంతో అధికారులు సుధాకర్ను అవనిగడ్డ బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో సుధాకర్ బదిలీపై మరలా జంగారెడ్డిగూడెం వచ్చారు. అప్పటి నుంచి అజయ్బాబు, కరుణకుమారి, అలుగు ఆనందశేఖర్, మరో డయాలసిస్ రోగి ములకాల వీరరాఘవులతో కలిసి సుధాకర్పై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి వేధించడం మొదలుపెట్టారు. 2023లో పెట్టిన కేసుకు సంబంధించి రాజీ పేరుతో భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఇవ్వకపోతే కేసులు, పిటీషన్లు పెడతామని బెదిరించారు. వేధింపులు తాళలేక ఈనెల 18న ఏరియా ఆస్పత్రిలోని ఆర్వో ప్లాంట్లో సుధాకర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ రాసి బాధ్యులైన నలుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నింది తులు అజయ్బాబు, కరుణకుమారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ చెప్పారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు.


