విద్యాసంస్థల బస్సులపై కేసులు
ఏలూరు (ఆర్ఆర్పేట: జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు శుక్రవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసినట్టు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. 36 కేసులు నమోదు చేసి రూ.5,14,400 అపరాధ రుసుంగా విధించామన్నారు. విద్యాసంస్థల బస్సులను ఫిట్నెస్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు నడపరాదన్నారు. రహదారి భద్రత నియమాలు తప్పక పాటించాలని లేకుంటే బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఏలూరు(మెట్రో): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని ఏజెన్సీలపై, సక్రమంగా పర్యవేక్షించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో భోజన పథకం అమలు తీరుపై శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మెనూ తప్పక పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు. సక్రమంగా పాఠశాలలపై పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించని ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు ఎంఈఓ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆదేశించారు. ఆహార కమిషన్ సభ్యుల తనిఖీలో అంగన్వాడీ కేంద్రాల్లో ఆహరం నాణ్యత లేకపోవడం, నూనె, గుడ్లు వంటి స్టాక్ సక్రమంగా లేనట్లుగా గుర్తించారని చెప్పి ఐసీడీఎస్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ సక్రమంగా లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ అభిషేక్ గౌడ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ శారద, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మూర్తి, డీఎస్ఓ విలియమ్స్, ఎంఈఓలు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: చోరీ కేసులో నిందితురాలు హిజ్రా షేక్ మున్నా అలియాస్ (సిరి)ని అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై శుభశేఖర్ తెలిపారు. ఈనెల 3న కొత్త ఈదరలోని బెక్కం పెద్ద సీత ఇంటికి గడియ పెట్టి బయటకు వెళ్లగా బంగారం చోరీ అయ్యింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక హైస్కూల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సిరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. నాలుగు బంగారపు ఉంగరాలు, రెండు చెవి దిద్దులు స్వాధీనం చేకున్నారు. సిరిపై 22 కేసులు ఉన్నట్టు ఎస్సై చెప్పారు.
ఏలూరు టౌన్: ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలోని పొట్టిపాడు రైల్వేగేట్ సమీపంలో బహిర్భూమికి వెళుతున్న ఓ వ్యక్తి గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎంఎస్ఎన్ ప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పొట్టిపాడుకు చెందిన కూలీ మజ్జి శ్రీను(62)గా గుర్తించారు. అతడికి చెవుడు ఉండటంతో రైలు వచ్చే శబ్ధాన్ని గుర్తించలేకపోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరం: రైలులో గంజాయి తరలిస్తున్న ము గ్గురు వ్యక్తులు భీమవరంలో రైల్వే పోలీసులకు చిక్కారు. రైల్వే సీఐ సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం ఒడిసాకు చెందిన మనుప్రధాన్, అరుణ్ప్రధాన్, డింకుడిగాల్ శుక్రవారం పూరి–తిరుపతి రైలులో ఒడిసా నుంచి విజయవాడకు 10 కిలో గంజాయిని నాలుగు బాక్సుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్నారు. భీమవరం టౌన్ రైల్యే స్టేష న్ వద్ద తనిఖీలు చేస్తుండగా ముగ్గురు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి అరెస్టు చేసినట్టు సోమరాజు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఎస్సై సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
విద్యాసంస్థల బస్సులపై కేసులు
విద్యాసంస్థల బస్సులపై కేసులు


