సిఫార్సులబదిలీలలు | - | Sakshi
Sakshi News home page

సిఫార్సులబదిలీలలు

Jun 30 2025 4:13 AM | Updated on Jun 30 2025 4:13 AM

సిఫార

సిఫార్సులబదిలీలలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్రంలో బదిలీలు అంటేనే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్‌లు నిర్వహించింది. అయితే ఎక్కడా సజావుగా సాగలేదు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. తాజాగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వె ల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సెక్రటరీలు సైతం బ దిలీల కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద ధర్నా చేయడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. వీరి బదిలీల్లో ఎమ్మెల్యేలు పెత్తనం చేయాలని చూడటంతో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

స్థానిక నాయకుల చెప్పుచేతల్లో పెట్టేలా..

గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సెక్రటరీల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలోని స్థానిక కూటమి నాయకుని సిఫార్సు ఉంటేనే లేఖలు ఇస్తున్నట్టు సమాచారం. స్థానిక నాయకుల సిఫార్సులు తీసుకుంటే ఆ తర్వాత తమ ఉద్యోగాలు ఆ స్థానిక నాయకుల వద్దే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వల్ల అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని సెక్రటరీలు అంటున్నారు. అదీ కాక ఎంత మందికి స్థానిక నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని, అర్హత ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ర్యాంకులు పట్టించుకోరా?

నియమ నిబంధనలు కాదని బదిలీల్లో సిఫార్సులపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యో గాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే తాము ర్యాంకులు సాధించి ఏం ప్రయోజనమని వాపోతున్నారు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు.

సీనియార్టీ జాబితా లేకుండానే..

ఏ శాఖలో అయినా సీనియార్టీ జాబితా ప్రదర్శించి దాని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాలయ ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితా రూపొందించకుండా తమను మూడు ప్రాంతాలు కోరుకోమని, వాటిని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు. తాము కోరుకున్న మూడు ప్రాంతాలనే మరో పది మంది కోరుకుంటే తమకు ఎక్కడి స్థానాలు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, స్పౌజ్‌ కేటగిరీల్లో కూడా జాబితా రూపొందించకుండా తమతో ఫారాలు నింపించుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

సచివాలయ ఉద్యోగుల గగ్గోలు

బదిలీల్లో ఎమ్మెల్యేల పెత్తనం

స్థానిక నాయకుల సిఫార్సుల మేరకే లేఖలు

కూటమి నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు

ర్యాంకుల ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌

సీనియార్టీ జాబితా లేకపోవడంపై ఆగ్రహం

పారదర్శకంగా చేపట్టాలి

గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్ల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తే అర్హులు నష్టపోతారు. బదిలీలకు సీనియార్టీ జాబితా తయారు చేయకుండా అధికారులు ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేస్తామనడం నిబంధనలకు విరుద్ధం. సొంత మండలాల్లోకి బదిలీలు చేయమనే నిబంధన అమలు చేస్తున్నప్పుడు ఇతర నిబంధనలు కూడా అమలు చేయాలి.

– కె.అజయ్‌బాబు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మార్గదర్శకాలు మర్చిపోయారు

ప్రభుత్వం బదిలీలపై జీఓ ఇచ్చి మార్గదర్శకాలు మర్చిపోయింది. గత 30, 40 ఏళ్లలో ఇలాంటి బదిలీలు చూడలేదు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో బదిలీలు ముగిసినట్టు ప్రచారం జరుగుతుండటం సెక్రటరీలను కలవరపెడుతోంది. ఎమ్మెల్యేల లేఖలకే ప్రాధానమిస్తే ఇక బదిలీలకు కౌన్సెలింగ్‌ ఎందుకు. లేఖలు పొందిన వారు మినహా మిగిలిన వారంతా ఆందోళనలో ఉన్నారు.

– ఈ.నరేష్‌, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సెక్రటరీ

విధులకు దూరం.. ప్రదక్షిణల పర్వం

సచివాలయాల వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సెక్రటరీలు స్థానిక కూటమి నాయకుల ఇళ్ల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి విధులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఉద్యోగులకు స్థానిక నాయకులతో నేరుగా సంబంధాలు ఉండటంతో వారు తొలి ప్రాధానత్యగా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అందుకున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో బంధుత్వమో, స్నేహమో ఉన్న వారిని వెంటబెట్టుకుని వారి చుట్టూ తిరిగి ఇప్పటికే ఎమ్మెల్యేల లేఖలను సంపాదించి సాంఘిక సంక్షేమ అధికారులకు పంపినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే 19 మంది అభ్యర్థులతో కూడిన సిఫార్సు లేఖను జిల్లా పంచాయతీ అధికారికి పంపినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సిఫార్సులబదిలీలలు 1
1/2

సిఫార్సులబదిలీలలు

సిఫార్సులబదిలీలలు 2
2/2

సిఫార్సులబదిలీలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement