
సాగు.. జాగు
ఈ ఫొటోను గమనించారా? పాలకోడేరు మండలం మోగల్లులోని రేలంగి చానల్ దుస్థితి. తణుకు రూరల్ మండపాక నుంచి అత్తిలి, ఇరగవరం మండలాల మీదుగా పాలకోడేరు మండలం మోగల్లు వరకు దాదాపు 27 కి.మీ పరిధిలో వేల ఎకరాల ఆయకట్టుకు ఈ రేలంగి చానల్ ద్వారా సాగునీరు అందుతుంది. ముందస్తు సాగు కోసం పశ్చిమ డెల్టాకు జూన్ 1నే సాగునీటిని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటికీ శివార్లకు సాగు నీరందని దుస్థితికి ఈ చిత్రం అద్దం పడుతుంది. పూర్తిస్థాయిలో సాగు నీరందక కాలువ పరిధిలోని తొలకరి పనులకు ఆటంకం కలుగుతోంది.
సాక్షి, భీమవరం : జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. ధాన్యం బకాయిలు విడుదల కాకపోవడం, పంట పెట్టుబడులకు సర్కారు నుంచి సాయం కొరవడటం, శివారు భూములకు సాగునీరు అందకపోవడం తదితర కారణాలతో జూన్ ముగిసిపోతున్నా తొలకరి పనులు ఇంకా జోరందుకోలేదు.
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుండగా 50 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1318 రకం, 25 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 7029 రకం, మిగిలిన విస్తీర్ణంలో ఎంటీయూ 1293, పీఎల్ఏ 1100 తదితర రకాలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. నవంబరు చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునే దిశగా గతంలో జూలై 15లోగా నాట్లు పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేసేవారు. జూన్ నెలాఖరుకు నారుమడులు వేయడం చాలా వరకు పూర్తికావడంతో పాటు ముందుగా వరి కోతలు జరిగే తాడేపల్లిగూడెం ప్రాంతంలో నాట్లు జోరందుకునేవి. ఈ సీజన్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జూన్ నెల ముగిసిపోతున్నా ఇంకా పనులు ముమ్మరం కావడం లేదు. ఇప్పటివరకు 3,120 ఎకరాలకు సంబంధించి నారుమడులు వేయగా, 2,680 ఎకరాల్లో మా త్రమే నాట్లు పడ్డాయి.
విడుదల కాని ధాన్యం సొమ్ములు
ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుండగా నెల రోజులైనా సొమ్ములు చేతికందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రబీ సీజన్లో జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్ల విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేయగా రూ.250 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి బకాయిలు రాలేదని రైతులు వాపోతున్నారు. తొలకరి పెట్టుబడుల కోసం చేతిలో సొమ్ముల్లేక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఆదుకోని ‘అన్నదాత సుఖీభవ’
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలకరి ప్రారంభంలోనే రైతు భరోసాగా రూ.7,500 మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందించారు. విత్తనాలు, నారుమడుల తయారీ, ఎరువుల కొనుగోలుకు రైతులు అప్పులు చేయాల్సిన పని ఉండేది కాదు. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. ఈ ఏడాదీ సాయం విడుదలపై స్పష్టత లేదు. దీంతో రైతులు పంట పెట్టుబడులకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
సాగునీరు.. అందని తీరు
జిల్లాలో 11 ప్రధాన పంట కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీటి సరఫరా జరుగుతోంది. క్లోజర్లో భాగంగా సుమారు రూ.77 కోట్ల విలువైన 150 పనులతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కొన్నింటికి అనుమతులు రాగా సకాలంలో పనులు పూర్తికాకపోవడం తొలకరి పనులపై ప్రభావం చూపుతోంది. ముందస్తు కోసమంటూ జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా క్లోజర్ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పటికీ పలుచోట్ల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలపైనే సాగుకు సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి.
ఖరీఫ్.. లేదు రిలీఫ్
జిల్లాలో నత్తనడకన తొలకరి పనులు
జూన్ ముగుస్తున్నా జోరందుకోని నారుమడులు
సర్కారు నుంచి కొరవడిన సహకారం
సాగునీటి సరఫరాలో జాప్యం
రూ.250 కోట్ల మేర ధాన్యం బకాయిలు
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగు

సాగు.. జాగు