
పేగు బంధం కాదన్నా.. మానవత్వం చాటి..
వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన ఆశ్రమ నిర్వాహకుడు
జంగారెడ్డిగూడెం: పేగు బందం కానరాలేదు. ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని నిలబెట్టిన వృద్ధురాలిని అనాథగా వదిలేశారు. ఆమె ఆఖరి మజిలీలోనూ పట్టించుకోకపోగా మాన వత్వం చాటుతూ ఆశ్రమ నిర్వాహకుడు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. కోడూరి శకుంతల అనే వృద్ధురాలిని నాలుగేళ్ల క్రితం జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి వృద్ధుల, వికలాంగుల, అనాథ ఆశ్రమంలో కుటుంబసభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఆమె జీవనం సాగిస్తోంది. ఇటీవల శకుంతల అనారోగ్యం పాలుకాగా కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేసినా స్పందించలేదు. చివరకు చికిత్స పొందుతూ శకుంతల (94) ఆదివారం కన్నుమూశారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తామని అప్పటివరకు చెప్పిన కుటుంబసభ్యులు చివరి నిమిషంలో ముఖం చాటేశారు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు శేఖర్ అన్నీ తానై వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబసభ్యులు, బంధువుల మధ్య నిర్వహించి సేవాతత్పరతను చాటారు.