
మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం
నరసాపురం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఆదివారం నుంచి వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా పనులను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు న్యాయం చేయడంలో ప్రభు త్వం తాత్సారం చేయడం దారుణమన్నారు. కోటిపల్లి కాశీ, ఎం.రత్నం, సీహెచ్ సత్యనారాయణ, ఫణి నాయకత్వం వహించారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
తణుకు అర్బన్: తణుకులో కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం శిబిరంలో జేఏసీ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను, కార్యదర్శి గెల్లా విజయ్కుమార్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించే విధానం అమల్లోకి రావాలని కోరారు. 25 ఏళ్లకు పైబడి విధుల్లో ఉంటున్నా రూ. 13 వేల వేతనాలే అమల్లో ఉండటం బాధాకరమన్నారు. నాయకులు దాసరి సత్యనారాయణ, రాపాక సురేష్, ప్రసాద్, రాపాక రవి తదితరులు పాల్గొన్నారు.
గూడెంలో ఏడో రోజుకు చేరిన దీక్షలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో కా ర్మికుల దీక్షలు ఆదివారం ఏడో రోజూ కొనసాగా యి. జేఏసీ నాయకులు మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రత్తి రమేష్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని అన్నారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం