
కూటమి ప్రభుత్వంలో రైతులు దివాలా
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వంలో రైతులు దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నారని, రైతు వ్యతిరేకి చంద్రబాబు పాలనలో రైతులు దయనీయ స్థితికి చేరుకున్నారని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం కొయ్యలగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధరలు లేవంటూ బాలరాజు వద్ద రైతులు ఏకరువు పెట్టారు. మిడిల్ గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదని, అదేంటని బయ్యర్లను అడిగితే ఆర్డర్స్ రాలేదంటున్నారన్నారు. విదేశీ ఆర్డర్లను సాధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని బాల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో పొగాకు సరాసరి ధర రూ.340 పైగా ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మార్క్ ఫెడ్ సంస్థను కొనుగోళ్లలో ప్రవేశపెట్టి రైతుకు గిట్టుబాటు ధర కల్పించగలిగామని కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికి వదిలేసిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో వైఎస్సార్సీపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, ఎంపీపీ గంజిమాల రామారావు, రైతు ప్రతినిధులు కాకర్ల నంది, గంటా రమేష్, గొడ్డటి నాగేశ్వరరావు, డి.బా బూరావు తదితరులు పాల్గొన్నారు.