
కూటమిలో నామినేటెడ్ రగడ
నేతల లాబీయింగ్
సాక్షి ప్రతినిధి,ఏలూరు: పేరుకే కూటమి ప్రభుత్వం.. పెత్తనమంతా టీడీపీదే.. కొన్నిచోట్ల జనసేన ఎమ్మె ల్యేలు ఉన్నా కూడా టీడీపీ నేతలే హవా సాగిస్తుండటం, గతంలోనే ముఖ్య నేతల మధ్య ఖరారైన పదవుల గురించి రెండు పార్టీల్లో ఆశావహులు పోటాపోటీగా మారుతుండటంతో ఉమ్మడి పశ్చిమలో నామినేటెడ్ రగడ తారాస్థాయికి చేరుకుంది. నియోజకవర్గ స్థాయి మార్కెట్ యార్డు పదవులు మొదలు జిల్లాస్థాయి డీసీసీబీ చైర్మన్ వరకు ప్రతిదీ పెండింగ్లోనే పడింది. డీసీసీబీ చైర్మన్ పదవి జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుకు ఖరారు అయిందని గతంలో బలంగా ప్రచారం సాగింది. తాజాగా మారిన సమీకరణాలతో టీడీపీ నేత కోళ్ల నాగేశ్వరరావు పేరు తెరమీదకు రావడంతో నియామకం పెండింగ్లో పడింది.
పెండింగ్లో పదవులు
జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య నామినేటెడ్ రగడ కొనసాగుతోంది. గతంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ఇన్చార్జి మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ రెండు, మూడు ప ర్యాయాలు ఎమ్మెల్యేలు, రెండు పార్టీల ముఖ్యుల తో సమావేశాలు నిర్వహించారు. దానికి అనుగుణంగా నియోజకవర్గాల్లో పదవులను రెండు పార్టీలు ఆమోదయోగ్యంగా పంచుకోవాలని, ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి మొ దటి ప్రాధాన్యం కూటమిలో మిగిలిన పార్టీలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. దీంతో పదవుల రగడకు తెరలేచింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను ఖరారు చేశారని నాలుగు నెలల క్రితమే ఆయా నేతల కార్యాలయాల్లో సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లాస్థాయి నేతలు కొందరు ఇద్దరినీ కలిసి వ్యక్తిగతంగా అభినందనలు కూడా తెలిపారు. కట్ చేస్తే.. నాలుగు రోజుల క్రితం 10 జిల్లాల డీసీసీబీ చైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేన నేపథ్యంలో పెండింగ్లో పెట్టింది.
పదవుల పందేరం
డీసీసీబీ చైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నేతల పోటాపోటీ
ఈ పదవి జనసేనకని గతంలో ప్రకటన
రెండు పార్టీల పోటీతో చైర్మన్ నియామకం పెండింగ్
మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల్లోనూ ఇదే తంతు
జిల్లాలో ప్రధాన యార్డుల పదవులన్నీ ఖాళీ
నామమాత్రపు ప్రాధాన్యత కూడా లేదని జనసేన నేతల ఆవేదన
తూర్పుగోదావరి జిల్లా పదవులతో లింక్ పెట్టి అక్కడ టీడీపీకి ఇస్తే ఇక్కడ జనసేనకు ఇవ్వాలని, అక్కడ జనసేనకు ఇస్తే ఇక్కడ టీడీపీకి ఇవ్వాలని కొందరు నేతలు చక్రం తిప్పడంతో డీసీసీబీ పెండింగ్లో పడింది. దీంతో అనూహ్యంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పేరు తెరపైకి రావడంతో పాటు ఇద్దరు నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇదే రీతిలో ఏలూరు జిల్లాలో చింతలపూడి అసెంబ్లీ సీటును టీడీపీ కోసం తాము త్యాగం చేశాం కాబట్టి మార్కెట్ యార్డు చైర్మన్ ఇవ్వాలని జనసేన నేతలు బలంగా పట్టుపట్టడంతో పాటు ముఖ్యులందరికీ వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయితే ఈ పదవిని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు టీడీపీ నేతకు ఖరారు చేశారు. దీనిపై వివాదం కొనసాగుతుండటంతో పెండింగ్లో ఉంది. అలాగే నూజివీడు, పోలవరం, కై కలూరులోనూ ఇవే డిమాండ్లు ఉండటంతో ఆయా యార్డుల పదవులు భర్తీ కాని పరిస్థితి. కై కలూరులో బీజేపీ నేతలెవ్వరూ యార్డు పదవులు అడగని పరిస్థితి. టీడీపీలోనే ఇద్దరు నేతలు పోటాపోటీగా డిమాండ్ చేస్తుండటం, ఎమ్మెల్యే ఒకరికి ఆమోదం తెలిపినా వివాదం రేగడంతో గతంలో ప్రకటించిన రెండు జాబితాలోనూ భర్తీ కాని పరిస్థితి. పోలవరంలో టీడీపీ నేతలు, జనసేన ఎమ్మెల్యే మధ్య ఇవే వివాదం కొనసాగుతుండటంతో ఇక్కడ కూడా పెండింగ్లో ఉంచారు. పోలవరం ఎస్టీ, కై కలూరు బీసీ–మహిళ, నూజివీడు ఎస్సీ–జనరల్కు కేటాయించారు. ఆశావహులు ఉన్నా గందరగోళంలో పరిస్థితి కొనసాగుతుండటం గమనార్హం.