
నీట్కు సర్వం సిద్ధం
5 కేంద్రాలు.. 1,200 మంది విద్యార్థులు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఆదివారం జరుగ నున్న నీట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఏలూరులోని కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 1,200 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 11 గంటల నుంచి కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు (సెల్ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు) అనుమతి లేదన్నారు. దివ్యాంగ విద్యార్థుల కోసం వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 163బీ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డు తప్ప ఇంకేమీ తీసుకురాకూడదన్నారు. తహసీల్దార్లు వి.శేషగిరి, శ్రీనివాసరావు ఉన్నారు.
పటిష్ట బందోబస్తు
ఏలూరు టౌన్: నీట్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. శనివారం ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా అదనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావుతో కలిసి ఆయన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశా రు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చే రుకునేలా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వివరాలను అభ్యర్థులు సులభంగా తెలుసుకునేలా సహాయ కేంద్రాలు, సమాచార సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల పరిశీలన
దెందులూరు: గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను డీఈఓ వెంకట లక్ష్మమ్మ, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ పరిశీలించారు. విద్యుత్, తాగునీరు, వైద్య సౌకర్యాలు, భవనాలను పరిశీలించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని స్పష్టం చేశారు. తహసీల్దార్ బి.సుమతి, ఎస్సై ఆర్.శివాజీ ఉన్నారు.
పరీక్షా కేంద్రాలు.. విద్యార్థులు
● ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటదిబ్బ, సబ్జైల్ ఎదురుగా, ఏలూరు – 240
● కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ, ఏలూరు – 360
● సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్, ఆర్ఆర్పేట, ఏలూరు – 240
● కేంద్రీయ విద్యాలయ, గోపన్నపాలెం, దెందులూరు మండలం –240
● ప్రభుత్వ హైస్కూల్, గోపన్నపాలెం – 120