
విద్యుదాఘాతంతో మృతి
నూజివీడు: మండలంలోని మీర్జాపురం హైస్కూల్ విద్యాకమిటీ చైర్మన్ పిన్నిబోయిన రామకృష్ణ (36) విద్యుత్షాక్తో గురువారం రాత్రి మృతిచెందారు. మీర్జాపురం శివారం కండ్రికలో రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బజారుకు వెళ్తుండగా కరెంటు స్తంభానికి చేయి తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు, అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమాన్ జంక్షన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ మృతితో కుటుంబం ఆధారం కోల్పోయినట్లయింది. విద్యుత్ షాక్తో మృతిచెందిన పిన్నిబోయిన రామకృష్ణ కుటుంబ సభ్యులను శుక్రవారం గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి పరామర్శించారు.
సీపెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
యలమంచిలి :విజయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)లో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ), డిప్లమో ఇన్ పాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సీపెట్ డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ విద్యార్హతతో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు మే 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్ 8న పరీక్ష నిర్వహించి వచ్చిన ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లు భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్ రంగంలో జూనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ అండ్ మేకర్ జూనియర్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు వస్తాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9398050255 నెంబరులో సంప్రదించాలని కోరారు.