
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జెడ్పీ హైస్కూళ్లలో పదో తరగతి చదవి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం స్థానిక జెడ్పీ మినీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు రూ.10 వేలు (ప్రథమ), రూ.5 వేలు (ద్వితీయ) చొప్పున పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం.వెంకట లక్ష్మమ్మ, ఇ.నారాయణ, డీసీఈబీ కార్యదర్శి ఎ.సర్వేశ్వరరావు, డీవైఈవో ఎన్.రవీంద్ర భారతి, ఎంఈవోలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
కోకో గింజల చోరీపై కేసు నమోదు
ద్వారకాతిరుమల: కోకో గింజల చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం తిమ్మాపురం గ్రామానికి చెందిన గంటా అజయ్కుమార్ తన 6 ఎకరాల తోటలో పండే కోకో గింజలను నిత్యం తన ఇంటి వద్ద ఆరబెట్టి, విక్రయిస్తాడు. ఈ క్రమంలోనే 350 కేజీల కోకో గింజలను గత నెల 30న రైతు తన ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో ఆరబెట్టాడు. సాయంత్రం వర్షపు చినుకులు పడుతున్నాయని కోకో గింజలను గుట్టగా చేసి, తడవకుండా బరకం కప్పాడు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి కోకో గింజలు కనిపించలేదు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని దొంగిలించినట్టు గుర్తించి, స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
అలంపురంలో హత్యాయత్నం
నిందితుల అరెస్ట్
పెంటపాడు: అలంపురంలో బుధవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. పెంటపాడు ఎస్సై కె. స్వామి తెలిపిన వివరాల ప్రకారం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన పెనుమాక రాజుకు, అదే గ్రామానికి చెందిన పేకేటి సుమన్కు మధ్య పాతగొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అలంపురం రజకచెరువు గట్టున వెళుతున్న రాజుతో సుమన్, తనతో పాటు ఉన్న మరో ఇద్దరితో కలిసి ఘర్షణకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో సుమన్ తన వద్ద ఉన్న చాకుతో రాజును పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి చెప్పారు. నిందితుడు సుమన్తో పాటు, అతనికి సహకరించిన బాదంపూడి జయప్రకాష్, గనిసాల మణిరత్నంలను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.