
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది.
వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు.
ట్రంప్–మస్క్ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు.
ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు.
ట్రంప్–మస్క్ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు.
తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు.
ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు.
ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి.