● ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్
● జీజీహెచ్లో క్షతగాత్రులకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డులో శనివారం జరిగిన టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ డిమాండ్ చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో, ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటూ లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్డు భద్రత విషయంలో అధికారులు అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని బోస్ సూచించారు.


