లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే లోవ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సుమారు 28 వేల మంది భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం వరకూ కిటకిటలాడింది. సాయంత్రం ఆరు గంటలకు దర్శనాల వేళ ముగిసినా, తిరుగు ప్రయాణాలతో వాహనాల రద్దీ కనిపించింది. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,38,630, పూజా టిక్కెట్లకు రూ.4,27,580, తలనీలాలకు రూ.10,600, వాహన పూజలకు రూ.13,050, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదులు అద్దెలు రూ.89,053, విరాళాలు రూ.9,043 వెరసి మొత్తం రూ.7,87,956లు ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.


