నాటికలకు పూర్వ వైభవమే లక్ష్యం
● సీఆర్సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో
సిల్వర్ జూబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు
● మార్చి 19, 20, 21 తేదీల్లో ప్రదర్శనలు
రావులపాలెం: తెలుగు నాటికలకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఉగాదికి కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 25 ఏళ్లుగా నాటికల పోటీలను నిర్వహిస్తూ సిల్వర్ జూబ్లీకి దూసుకువెళ్తున్నారు. బుధవారం స్థానిక సీఆర్సీ ఓల్డేజ్ హోమ్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాపరిషత్ కన్వీనర్ గొలుగూరి వెంకటరెడ్డి, సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహన్రెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కె.సూర్య తెలిపారు. మార్చి 19, 20, 21 తేదీల్లో ఉగాది సందర్భంగా ఈ నాటికలను ప్రదర్శిస్తామన్నారు. తొలిరోజు రెండు నాటికలు గోవాడ క్రియేషన్స్ హైదరాబాదు వారి అమ్మ చెక్కిన బొమ్మ, బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, రెండో రోజు మూడు నాటికలు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహాన, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిటికెన వేలు, చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి అసత్యం, మూడో రోజు రెండు నాటికలు ఎస్వీ రంగారావు కళా స్రవంతి కాకినాడ వారి ఆచమనం, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందూ దొందే నాటికలతో పాటు చివరి రోజు సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రతి నాటికకు రూ.25 వేల పారితోషికం, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో సీఆర్సీ డైరెక్టర్లు మల్లిడి అంజనీకుమార్రెడ్డి, కుడుపూడి శ్రీనివాసరావు, జి.రంగనాయకులు, బి.నాగేశ్వరరావు, పలివెల త్రిమూర్తులు పాల్గొన్నారు.


