భవితకు భద్రత బీమా..
● ఆరు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైనం
● ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తపాలా శాఖ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా ఈ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు చేసుకున్న కంపెనీల ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఎస్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు.
యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్
దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 ఏళ్లుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి రూ.వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది.
హోల్ లైఫ్ అస్యూరెన్స్
ఈ పాలసీకి 19 నుంచి 55 ఏళ్ల మధ్య గలవారు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బోనస్లు వర్తించవు. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారునికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు.
కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్
ఈ పాలసీకి 19 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది..
ఎండోమెంట్ అస్యూరెన్స్
ఈ పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. కనీస బీమా రూ.20 వేలు కాగా గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్కు అవకాశం ఉం టుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోతలు తప్పవు. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది.
జాయింట్ లైఫ్ అస్యూరెన్స్
ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్పై బోనస్లలో కోత ఉంటుంది. పాలసీ దారుడి మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు లభిస్తాయి. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు.
చిల్డ్రన్ పాలసీ..
పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయసు ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు వయసు ప్రకారం బీమా తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాల పరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి.
దరఖాస్తు ఇలా
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి పథకంలో భాగస్వాములు కావచ్చు.


