చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే కోటి సంతకాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిపక్షాలు ప్రజల గొంతుకై ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజేస్తాయని, వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారని, ఆయన కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల ఉద్యమం చేపట్టారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నా రు. ఈ నెల 15న నిర్వహించనున్న కోటి సంతకాల ర్యాలీ సన్నాహక సమావేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అధ్యక్షతన బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేణు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను చంద్రబాబు అనుయాయులకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. వైద్యం, విద్యను ప్రజలకు దూరం చేస్తున్న ప్రభుత్వానికి కోటి సంతకాలు సేకరించి కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన 4లక్షల 20వేల సంతకాల ప్రతులను సోమవారం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయ కర్తలు, అనుబంధ సంఘాలు, రాష్ట్ర, మండల, గ్రామస్థాయి ప్రతినిధులతో కలిసి వాహనంపై తాడేపల్లికి తీసుకుని వెళతామన్నారు. వాటిని ఈ నెల 18న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేస్తారన్నారు. ప్రజల నిరసన ఎలా ఉందో? చంద్రబాబుకు చెప్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. 15న వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వ నిర్ణయం తప్పని, ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలిగిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెల్లుబోయిన వేణు తెలిపారు. ప్రభుత్వ భూమి, భవనాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే కాకుండా రెండేళ్లపాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా జీవో ఇచ్చారన్నారు. ఇంత దారుణంగా ఎక్కడైనా ఉంటుందా? తన తాబేదారుల ఆస్తులు పెంచుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు వాడుకుంటున్నాడన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదల ఆస్తులు దోచి పెద్దలకు పెట్టుకున్నాడు. ఇదే తీరు మెడికల్ కళాశాలల అంశంలో తారాస్థాయికి చేరిందన్నారు.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమం చేస్తామని వేణు అన్నారు.
జగన్ విద్య, వైద్యం ప్రజలకు చేరువ చేశారు
పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను కట్టుకుంటూ వస్తే..చంద్రబాబు వాటిని అమ్ముకుంటూ పోతున్నారన్నారు. వైఎస్ జగన్ భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు మాట్లాడుతూ కోటి సంతకాల ఉద్యమం వైఎస్సార్ సీపీ పోరాటం కాదని, ప్రజా ఉద్యమం అన్నారు. టీడీపీ నేతలే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. అనంతరం 15వ తేదీన వాహ నాలు పార్కు చేసే ప్రాంతాలను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌ సింగ్ బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, గుబ్బల తులసీరామ్, అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, మెనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జామౌలాలి, వివిధ విభాగాల అధ్యక్షులు మార్తి లక్ష్మి, విజయసారధి, నేతలు పాల్గొన్నారు.
రేపటి ర్యాలీ సన్నాహక సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే కోటి సంతకాలు


