మాజీ ఎంపీ కృష్ణమూర్తికి అంతిమ వీడ్కోలు
అమలాపురం టౌన్/ అయినవిల్లి: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి అంతమ యాత్ర అమలాపురంలో ఆదివారం సాయంత్రం విషాద వాతావరణంలో జరిగింది. తొలుత కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా అయినవిల్లి మండలం విలస గ్రామం రావిగుంట చెరువులోని ఆయన స్వగృహానికి తీసుకు వచ్చారు. అక్కడ రాజకీయ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ కృష్ణమూర్తి చిరస్మరణీయుడని అన్నారు. చిర్ల జగ్గిరెడ్డితో పాటు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పినిపే శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ పాముల దేవీప్రకాష్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీలు చింతా అనురాధ, బుచ్చి మహేశ్వరరావు, మాజీ మంత్రి పరమట వీరరాఘవులు, ఎంపీపీ మార్గాని గంగాధర్లు కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఫ అనంతరం అంతిమ యాత్రలో భాగంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం ఆపారు. తర్వాత అమలాపురం నల్ల వంతెన సమీపం కలెక్టరేట్ రోడ్డులోని కృష్ణమూర్తి సొంత గొడౌన్ల వెనుక అంత్యక్రియలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణమూర్తి పార్థివ దేహంపై పార్టీ జెండాను వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి పరమట రాఘవులు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వైఎస్సార్ సీపీ నాయకులు డీఎంఆర్ రాజశేఖర్, వంటెద్దు వెంకన్నాయుడు, ఉండ్రు వెంకటేష్, సరెళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ముషిణి రామకృష్ణారావు, దేవరపల్లి రాజేంద్రబాబు, అయితాబత్తుల సుభాషిణి, యార్లగడ్డ రవీంద్ర, జిల్లా దళిత ఐక్య వేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్బాబు, పెనుమాల చిట్టాబాబు, నాతి శ్రీను, పెయ్యల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.
ఏ తల్లి కన్న బిడ్డో..
ఫ పెంట కుప్పపై ప్రత్యక్షం
ఫ చేరదీసిన మానవత్వం
కపిలేశ్వరపురం (మండపేట): ఏ తల్లి కన్న బిడ్డో.. కాన్పు కాగానే పెంట కుప్ప పాలయ్యాడు. జనమంతా చలికి వెచ్చని దుప్పటి మాటున నిద్రలో ఉన్న సమయమది. మంచు కురిసే వేళ ఎముకలు కొరికే చలిలో ఆరుబయట పశువుల పాక పక్కన పెంట కుప్పపై ఓ బిడ్డ కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది. కుక్కలు చుట్టుముట్టినా మృత్యుంజయుడిలా ఊపిరిపోసుకున్న ఆ ఆబిడ్డను మానవత్వం అక్కున చేర్చుకుంది. మండపేట పట్టణంలోని సత్యశ్రీ రోడ్డు కోళ్లఫారం ఎదురుగా గేదెల పాక వద్ద మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదలివెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతు ఏడుపును విని ఆ బిడ్డను చూశాడు. చెంతనే ఉన్న కుక్కలను బెదరగొట్టి పిల్లాడిని చేరదీసి పట్టణంలోని సీహెచ్సీలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో శిశువును పరీక్షించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. పట్టణ ఎస్సై ఎన్.రాము ఆదేశాలపై హెచ్సీ కాంతారావు ఆసుపత్రిని సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీఓ యు.పూర్ణిమ ఆదేశాలపై సెక్టార్ సూపర్వైజర్ సీహెచ్ నాగశ్రీదేవి, అంగన్వాడీ సీహెచ్ రాణి ఆసుపత్రికి వెళ్లారు. అమలాపురంలోని శిశుగృహ నిర్వాహకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శిశువు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
మరో బాలికపై అత్యాచారం
ముమ్మిడివరం: వరుసగా బాలికలపై అత్యాచారాలు జరుగుతుండడంతో కోనసీమ జిల్లాలో కలకలం రేపుతుంది. నెల రోజుల క్రితం ఐ.పోలవరం మండలం బాణాపురంలో జనసేన నాయకుడు ఓ బాలికపై అత్యాచారం చేయగా, వారం క్రితం ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందట ఉప్పలగుప్తం మండలంలో ఓ తండ్రే కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఇది మరువక ముందే ముమ్మిడివరంలో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ముమ్మిడివరం ఓ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు చిన అగ్రహారానికి చెందిన కాలాడి సతీష్ రెండేళ్లుగా ఆ బాలికను ప్రేమ పేరుతో మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ ఎం.మోహన్కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి.జ్వాలాసాగర్లు సతీష్పై అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.
మాజీ ఎంపీ కృష్ణమూర్తికి అంతిమ వీడ్కోలు


