
ఒక్క క్లిక్తో సమగ్ర సమాచారం
● పాఠశాలల అభివృద్ధికి యూ డైస్ ప్లస్
● 23 నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు
వేగవంతం చేయాలి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యూ డైస్ ఫ్లస్ నమోదు, అప్డేషన్ను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ వేగవంతం చేయాలి. ఈ నెలాఖరులోగా నూరు శాతం పూర్తి చేయాలి. ఇప్పటికే ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు అవగాహన కల్పించాం. గడువుకు ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.
– డి.తాతారావు, ఏఎస్ఓ, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ముమ్మిడివరం
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల నమోదు ప్రక్రియ, అప్డేషన్ నిరంతరాయంగా జరుగుతోంది. ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న ఆధార్ అప్డేషన్ను పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. యూ డైస్ ఫ్లస్ సమాచారం ఆధారంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల సదుపాయాలకు నిధులు కేటాయిస్తున్నారు.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రాయవరం: విద్యా వ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక్క క్లిక్తో ప్రభుత్వ పాఠశాలల పూర్తి సమాచారం వెబ్సైట్లో ప్రత్యక్షమవుతోంది. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంతో పాటు మౌలిక వసతులు ఏ పాఠశాలలో ఎలా ఉన్నాయో, ఎంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారన్న విషయాలు స్పష్టంగా తెలుసుకునే వీలుంది. ఇప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూ డైస్ ఫ్లస్ను అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో యూడైస్ నమోదు మాన్యువల్గా ఉండగా 2022–23 నుంచి యూడైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)గా ఆధునికీకరించారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని సేకరించి, అప్డేట్ చేస్తున్నారు. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్డేట్ చేయగా.. ఇకపై నిరంతరం సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యుల్స్గా వెబ్సైట్ను మూడు భాగాలుగా విభజించి సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
వివరాలు కీలకం
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ప్రతి విద్యార్థి వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు నమోదు చేయగా, ప్రస్తుత సమాచారంతో అప్డేట్ చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు, తాగునీరు తదితర సదుపాయాల వివరాలతోపాటు వాటి స్థితిగతులపై తాజా సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందుతున్న వసతుల కల్పనకు యూడైస్ ఫ్లస్లోని వివరాలు కీలకం కానున్నాయి. అవినీతికి పాల్పడకుండా ఈ విధానం ఉపయోగపడనుంది. వెబ్సైట్లో నమోదైన విద్యార్థులకే యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని అందించనున్నారు.
ప్రతి విద్యార్థికి నంబర్ కేటాయింపు
యూ డైస్ ప్లస్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి ఏడాది అన్ని పాఠశాలల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో నమోదు చేసిన ప్రతి విద్యార్థికి ఒక పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పీఈఎన్) కేటాయిస్తారు. దీని ద్వారా ఆ విద్యార్థి దేశ వ్యాప్తంగా ఏఏ పాఠశాలల్లో ఏఏ తరగతులు చదివాడు అనేది కచ్చితంగా తెలుస్తుంది. పదో తరగతి విద్యార్థి బోర్డు పరీక్షలు రాయాలంటే ఇందులో నమోదై ఉండాల్సిందే. అలాగే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు మాదిరిగానే జారీ చేయాలి. జిల్లాలో 2.40 లక్షల మందికి అపార్ కార్డులు జనరేట్ చేయాల్సి ఉండగా, 2.25 లక్షల మందికి పూర్తయ్యింది. ఇంకా 15 వేల మందికి అపార్ కార్డులు జనరేట్ చేయాలి.
23 నుంచి ఆధార్ శిబిరాలు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్లు పైబడి ఉన్న విద్యార్థుల వేలిముద్రల అప్డేషన్ చేయనున్నారు. జిల్లాలో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 2.40 లక్షల మంది విద్యార్థుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1.98 లక్షల మంది అప్డేట్ కాగా, ఇంకా 42 వేల మంది విద్యార్థులకు ఆధార్ వేలిముద్రల అప్డేషన్ చేయాల్సి ఉంది. దీనికోసం పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధార్ అప్డేషన్ శిబిరాలను ఈ నెల 23 నుంచి 30 వరకూ నిర్వహించనున్నారు.

ఒక్క క్లిక్తో సమగ్ర సమాచారం

ఒక్క క్లిక్తో సమగ్ర సమాచారం