
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పి.గన్నవరం: స్థానిక ఏటిగట్టు సెంటర్లో మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు సమీపంలోని బట్టాయగూడెంనకు చెందిన షేక్ నాగూర్ మీరా (50) 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి డీఎస్ పాలెంలో నివసిస్తున్నాడు. మంగళవారం, శుక్రవారాల్లో అతడు షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఏటిగట్టు సెంటర్లో షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేసి, మూడు రోడ్ల సెంటర్కు సైకిలుపై వస్తుండగా అతడిని వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద స్థానికులు అడ్డుకుని లారీని ఆపారు. మృతదేహం వద్ద అతడి భార్య జీ బాషా బోరున విలపించింది. అందరితో కలివిడిగా ఉండే నాగూర్ మీరా ప్రమాదంలో మృతి చెందడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు.
రైల్వే ప్లాట్ఫాంపై
గుర్తు తెలియని వ్యక్తి..
తుని రూరల్: అన్నవరం రైల్వే రెండవ ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ తుని ఎస్సై పి.వాసు మంగళవారం తెలిపారు. ప్లాట్ఫాంపై బెంచీ కింద మరణించి ఉన్న వ్యక్తి శరీరంపై నలుపు రంగు టీ షర్టు, నీలం రంగు ట్రాక్ ఉన్నాయన్నారు. మృతుడికి కొంతదూరంలో కాఫీ రంగు బ్యాగ్ ఉందన్నారు. ఎవరైన గుర్తిస్తే జీఆర్పీకి 9490619020 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. హెచ్సీ మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాం తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామన్నారు.
పాము కాటుకు మహిళ..
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలోని బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని ధారపల్లిలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం మేరకు బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని బాపన్నధారకు చెందిన బుట్టారి సన్యాసిరావు, లోవకుమారిలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ధారపల్లిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే సోమవారం రాత్రి బుట్టారి లోవకుమారి తన ఇంటిలోనే నేలపై నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున పాము కాటుకు గురైంది. ఆమెను బంధువులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు భర్త బుట్టారి సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి