
అపర సంజీవనికి.. తీస్తున్నారా ఊపిరి!
8
లో
సాక్షి, రాజమహేంద్రవరం: అపర సంజీవనిగా పేరొంది.. లక్షలాది మంది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి.. వారికి కొత్త ఊపిరి అందించిన అపూర్వ పథకం ఆరోగ్యశ్రీ. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఈ పథకం.. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించింది. ఆ మహానేత తదనంతరం ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని దాదాపు నిర్వీర్యం చేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయానికి 938 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. వాటిని ఏడాది కాలంలోనే 2,436కు పెంచారు. అనంతరం వాటిని మరింత పెంచి 3,275 చికిత్సలకు విస్తరించారు. అంతే కాకుండా, వార్షిక చికిత్స వ్యయాన్ని తొలుత రూ.5 లక్షలకు.. ఆ తరువాత ఏకంగా రూ.25 లక్షలకు పెంచి, ప్రజలకు ఆరోగ్య భరోసాను అందించారు. అవసరాన్ని బట్టి ఇతర రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో సైతం చికిత్స పొందే అవకాశం కల్పించారు. ఇటువంటి మహత్తర పథకాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని వెనుక డాక్టర్ వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేసిన మంచిని మరుగున పెట్టే కుట్ర ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
ఏం చేస్తున్నారంటే..
ఆరోగ్యశ్రీ పథకం పేరును కూటమి సర్కారు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. అయినప్పటికీ జనం ఇప్పటికీ ఆరోగ్యశ్రీ గానే ఈ పథకాన్ని పిలుస్తున్నారు. దీనిని సహించలేని ప్రభుత్వం ఏకంగా ఈ పథకానికి మంగళం పాడేందుకు దాదాపు రంగం సిద్ధం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ స్థానంలో ప్రభుత్వం ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) తీసుకుని వస్తోంది. దీనిని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి వయో వందన యోజన’ పేరుతో ప్రత్యేక కార్డుల రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది. ఆయుష్మాన్ భారత్ అమలుపై ఉద్యోగులకు శిక్షణ సైతం పూర్తి చేశారు. త్వరలోనే ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం ఇటు ప్రజల్లో.. అటు ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. కొత్త విధానం అమలులోకి వస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారే అవకాశం ఉందన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.
చికిత్సల సంఖ్య కుదింపు!
ఆరోగ్యశ్రీలో ఏకంగా 3,275కు పైగా చికిత్సలు అందిస్తూండగా.. ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ సంఖ్య 1,900 లోపే ఉంటుంది. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు ఈ నూతన పథకంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి, దీని పరిధిలోకి రాని చికిత్సలను బీమా పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇదే కనుక జరిగితే ఇప్పటి వరకూ నయాపైసా కూడా చెల్లించకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుంది. పైగా, ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదలవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అమలులోకి వస్తే చికిత్స క్లెయిమ్కు అప్రూవల్ వచ్చాక కలెక్టర్ ద్వారా నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. ఇది కూడా రోగులకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్
ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నాల్లో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నిలిపివేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బిల్లులను సర్కారు నిలిపివేసింది.
వైఎస్సార్ సీపీ పాలనలో..
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 2023 వరకూ జిల్లా వ్యాప్తంగా రూ.508,49,95,571 వెచ్చించారు.
● 2,48,805 మందికి చికిత్స అందించారు.
● ఏటా రూ.50 కోట్లకు పైనే నిధులు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశారు.
● గుండె, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు.
● బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, అల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ (14 ఏళ్లు పైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షల చొప్పున వెచ్చించారు. ఇటువంటి వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీలో నయా పైసా కూడా చెల్లించనవసరం లేకుండానే చికిత్స చేయించుకునే అవకాశాన్ని పేదలకు కల్పించారు.
ఆరోగ్యశ్రీ చికిత్సల వివరాలు
సంవత్సరం చికిత్స వెచ్చించిన
పొందిన (రూ.కోట్లు)
వారు
2019-20 25,750 62.71
2020-21 29,602 62.15
2021-22 47,039 89.48
2022-23 1,46,414 294.15
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
ఆరోగ్యశ్రీని నీరుగార్చే దిశగా
కూటమి సర్కారు అడుగులు
ఆయుష్మాన్ భారత్గా
మార్చేందుకు రంగం సిద్ధం
ఇప్పటికే ఉద్యోగులకు
ముగిసిన శిక్షణ
కార్డుల రూపకల్పనకు శ్రీకారం
85 శాతం పూర్తి
త్వరలో అమలుకు ప్రణాళికలు
జిల్లాలో ఆరోగ్యశ్రీ వివరాలు
నెట్వర్క్ ఆస్పత్రులు 78
వీటిలో ప్రైవేటు 43
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5
ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28
జీజీహెచ్ 1
ఏరియా ఆస్పత్రి 1
దంత వైద్య శాలలు (ఈహెచ్ఎస్) 16
ఆరోగ్యశ్రీ కార్డుదారులు 5,12,000
‘మిత్ర’ ద్రోహం
ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేత యత్నాలపై ఆ విభాగంలోని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో తీసుకుని వచ్చే నూతన పథకంలోకి వారిని తీసుకుంటారా లేక బీమా కంపెనీ ఉద్యోగులే నూతన పథకాన్ని అమలు చేస్తారా అనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. దీంతో, తమకు ఉద్యోత భద్రత కరువైందని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రల భవితవ్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుష్మాన్ భారత్ అమలు లాగిన్ను సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రిలోని మెడికో ద్వారా చేపడతారు. దీంతో ఆరోగ్య మిత్రల ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా 67 మంది ఆరోగ్య మిత్రలు ఆందోళన చెందుతున్నారు.

అపర సంజీవనికి.. తీస్తున్నారా ఊపిరి!

అపర సంజీవనికి.. తీస్తున్నారా ఊపిరి!