ఆ సొమ్ము ఏ మూలకు? | - | Sakshi
Sakshi News home page

ఆ సొమ్ము ఏ మూలకు?

Jun 28 2025 8:17 AM | Updated on Jun 28 2025 8:17 AM

ఆ సొమ్ము ఏ మూలకు?

ఆ సొమ్ము ఏ మూలకు?

హేవలాక్‌ బ్రిడ్జి అభివృద్ధికి గతంలోనే

రూ.400 కోట్లతో అంచనాలు

ఇప్పుడు కేవలం రూ.94 కోట్లు

తెచ్చి హడావుడా?

అందులోనూ జీఎస్‌టీ పోనూ

మిగిలేది రూ.77 కోట్లే

ఆ డబ్బుతో ఏం చేస్తారు?

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ విమర్శ

రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ కూటమి నాయకులు నానా హంగామా చేస్తున్నారని మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మారినా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగడం సహజమని, అయితే ఎవరు కృషి చేశారో కూడా గుర్తించాలని అన్నారు. ‘దాదాపు 2.3 కిలోమీటర్ల పొడవైన హేవలాక్‌ వంతెన అభివృద్ధికి కనీసం రూ.400 కోట్లు ఖర్చవుతుందని గతంలోనే అంచనా వేయించాం. అటువంటిది ఇప్పుడు కేవలం రూ.94 కోట్లు తెచ్చి ఆ వంతెనకు రోడ్డు వేస్తామని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూటమి నాయకులు చెప్పడం వింతగా ఉంది. ఇందులో 18 శాతం జీఎస్‌టీ పోనూ రూ.77 కోట్ల వరకూ మాత్రమే మిగులుతుంది. ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది?’ అని భరత్‌రామ్‌ ప్రశ్నించారు. హేవలాక్‌ బ్రిడ్జి అభివృద్ధికి తన హయాంలో కృషి చేశానన్నారు. శివలింగం పక్కన, ఇటువైపు రైల్వే స్థలం కావడంతో ప్రత్యామ్నాయంగా 2,583.33 చదరపు మీటర్ల భూమిని వీఎల్‌ పురం లారీ స్టాండ్‌ వద్ద బదలాయించడానికి ఉత్తర్వులు తెచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుంచి ఐఎల్‌టీడీ జంక్షన్‌ వరకూ రోడ్డు విస్తరణలో రైల్వే స్థలం పోతున్నందున ప్రత్యామ్నాయంగా వీఎల్‌ పురంలోనే స్థలం ఇచ్చామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు 2015లోనే రూ.35 కోట్లు తెచ్చి ఏం చేశారో, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీకుండా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ లో కూటమి నాయకులు చెప్పేవన్నీ చేయాలంటే రూ.700 కోట్లు అవుతుందన్నారు. గజేంద్రసింగ్‌ షెకావత్‌ కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండగా తన కృషి ఫలితంగా నగరంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి రూ.88 కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతో మురుగు నీటిని మళ్లించే కార్యక్రమం చేపట్టకుండా సోకులు చేస్తే ప్రయోజనముండదని భరత్‌రామ్‌ హితవు పలికారు. రివర్‌ ఫ్రంట్‌కు రూ.22 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ.8 కోట్లకు కుదించడం వింతగా ఉందన్నారు. తాను ఎంపీగా ఉండగా చేసిన కృషి ఫలితంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేసిందని, ఆవిధంగా బొమ్మూరులో సైన్స్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.15.20 కోట్లు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో పూర్తయిన మోరంపూడి ఫ్లైఓవర్‌, సైన్స్‌ సెంటర్‌ను కూట మి నాయకులు ప్రారంభించడం తప్పు కాదని, అయి తే, దాని కోసం కృషి చేసిన వారిని కూడా గుర్తిస్తే గౌర వప్రదంగా ఉండేదని అన్నారు. తాను ఎంపీ లాడ్స్‌ నిధులు తీసుకొచ్చి గోదావరి గట్టున ఫూలే – అంబేడ్క ర్‌ భవన్‌ నిర్మిస్తే, కూటమి నాయకులు హడావుడి చేస్తున్నారని అన్నారు. ‘గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజమహేంద్రవరం మీద ప్రేమతో రూ.125 కోట్ల స్పెషల్‌ గ్రాంటు ఇచ్చారు. ఆ నిధులతో హ్యాపీ స్ట్రీట్‌, గోదావరి స్టేషన్‌ ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద పుష్కర్‌ ప్లాజా, సుబ్రహ్మణ్య మైదానంలో ఓపెన్‌ ఎయిర్‌ యాంఫీ థియేటర్‌ నిర్మాణాలతో పాటు కంబాల చెరువు సుందరీకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం’ అని భరత్‌రామ్‌ గుర్తు చేశారు. అలాగే, నగరంలోని రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం అభివృద్ధికి నిధులు తెచ్చి, చేపట్టిన కొత్త భవనం నిర్మాణం తుది దశకు చేరిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement