
పేద పిల్లల చదువుకు.. ఆర్టీసీ తోడు
● బస్ పాస్ల జారీకి శ్రీకారం
● 12 ఏళ్లలోపు విద్యార్థులు, 18 ఏళ్ల లోపు
విద్యార్థినులకు, దివ్యాంగులకు ఉచితం
● ఇతర ప్రయాణికులకు రాయితీ సౌకర్యం
రాజమహేంద్రవరం సిటీ: పేద పిల్లల చదువులకు ప్రభుత్వ రంగంలోని ఏపీఎస్ ఆర్టీసీ తోడుగా నిలుస్తోంది. అర్హత ఉన్న వారికి ఉచితంగా, మిగిలిన వారికి రాయితీపై పాస్లు జారీ చేస్తోంది. వివిధ కేటగిరీల విద్యార్థులతో పాటు నిత్యం ప్రయాణించే వారికి కూడా రాయితీపై మంత్లీ సీజనల్ టికెట్లు (ఎంఎస్టీ) అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో ఇప్పటికే ఈ ఉచిత బస్ పాస్లు జారీ చేస్తోంది. దీని కోసం జిల్లాలోని రాజమహేంద్రవరం, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉచితంతో పాటు రాయితీ, దివ్యాంగుల (పీహెచ్) పాస్లు కూడా జారీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు డిపోల పరిధిలో 2024–25 సంవత్సరంలో వివిధ రకాల పాసులు మొత్తం 75,606 అందించారు.
ఉచిత పాస్లు ఇలా..
పన్నెండేళ్ల లోపు విద్యార్థులు, 18 ఏళ్ల లోపు విద్యార్థినులు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు పాస్లు మంజూరు చేస్తున్నారు. కావలసిన వారు విద్యార్థి ఫొటో, స్కూల్ యాజమాన్యం నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించి ఈ పాస్ పొందవచ్చు. ఆర్టీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని కౌంటర్ వద్దకు వెళ్తే వెంటనే ఉచిత పాస్ పొందవచ్చు. పాస్ పొందిన విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠశాల లేదా కళాశాలకు 20 కిలోమీటర్ల దూరం వరకూ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
దివ్యాంగులకూ ఉచితం
దివ్యాంగులకు మూడేళ్ల వ్యవధితో ఉచిత పాస్లు అందిస్తున్నారు. ఈ పాస్ పొందడానికి సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ సమర్పించాలి.
రాయితీపై..
నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో రాయితీ బస్ పాస్లు మంజూరు చేస్తారు. కావాల్సిన వారు పాస్ ధరతో పాటు నెలవారీ గుర్తింపు కార్డుకు రూ.50, సర్వీస్ చార్జీ రూ.40 అదనంగా చెల్లించాలి. రాయితీతో పాటు సంవత్సరం గుర్తింపు కార్డు కావాల్సిన వారు రూ.100 చెల్లించాలి. గడువు ముగిశాక రెన్యువల్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్/హెచ్ఎం సంతకం చేయించుకుని తిరిగి పొందాలి. సాధారణ విద్యార్థులకు జూన్ నుంచి ఏప్రిల్ వరకూ, ఐటీఐ, పారా మెడికల్ వంటి కోర్సులు చదివే వారికి మే నెల వరకూ పాస్లు మంజూరు చేస్తారు.
ప్రత్యేక కౌంటర్లు
కళాశాలలు, స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త బస్ పాస్ల జారీకి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మంజూరు చేస్తున్నాం. కొత్త పాస్ల మంజూరు, పాతవి రెన్యువల్ చేసి, విద్యార్థులకు వేగంగా అందించేందుకు జిల్లాలోని నాలుగు బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం.
– వై.సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రజా
రవాణా అధికారి, రాజమహేంద్రవరం
జిల్లాలో డిపోల వారీగా ఏపీఎస్ ఆర్టీసీ రెండేళ్లుగా జారీ చేస్తున్న బస్పాస్ల వివరాలు
డిపో 2023–24 2024–25
ఉచిత రాయితీ దివ్యాంగ ఎంఎస్టీ ఉచిత రాయితీ దివ్యాంగ ఎంఎస్టీ
గోకవరం 797 7,423 415 1,318 1,963 7,492 311 1,486
కొవ్వూరు 389 5,333 199 957 368 4,766 144 800
నిడదవోలు 235 3,899 285 1,396 313 3,240 243 1,213
రాజమహేంద్రవరం 2,508 41,187 1,322 8,895 582 41,317 863 8,477

పేద పిల్లల చదువుకు.. ఆర్టీసీ తోడు

పేద పిల్లల చదువుకు.. ఆర్టీసీ తోడు