
వంచనపై.. జనం బాట
● చంద్రబాబు మోసాలను
ప్రజల్లోకి తీసుకెళ్దాం
● హామీలు నెరవేర్చే వరకూ వారి
పక్షాన పోరాటం
● ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు
● కూటమి తాటాకు చప్పుళ్లకు
బెదిరేది లేదు
● ఏదైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం
● 3 దశల్లో ‘బాబు ష్యూరిటీ..
మోసం గ్యారంటీ’
● జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: ‘సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోంది. చంద్రబాబు చేస్తున్న దగాను క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటం చేద్దాం’ అంటూ వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలు, అభిమానులనుద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోతే ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని అన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే బాధ్యత తీసుకుని పోరాడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ కూడా సక్రమంగా అమలు చేయకపోయినా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చంద్రబాబు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. హామీలు ఎక్కడ నిలబెట్టుకున్నారని జనంలోకి వెళ్లి అడుగుతామన్నారు. ఇందులో భాగంగానే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మూడంచెల్లో జరుగుతుందని, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ డాక్యుమెంట్ చూపించారు. చంద్రబాబు ఇచ్చిన బాండ్లు, మాజీ సీఎం జగన్ ఇచ్చిన పథకాలను కూటమి సర్కారు ఎలా ఎగ్గొడుతోంది, చంద్రబాబు మోసాలతో ప్రజలకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు (బాబు), వైఎస్సార్ సీపీ నేత మేడా గురుదత్ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర తెలుకుల, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ తదితరులు పాల్గొన్నారు.

వంచనపై.. జనం బాట