
వందనానికి వంకలా!
● అంగన్వాడీల పిల్లలకు అందని పథకం
● ప్రభుత్వోద్యోగులుగా భావిస్తే
ఆ ప్రయోజనాలన్నీ తమకూ కల్పించాలి
● యాప్ల యాతనతో పనిభారం పెంచారు
● 42 రోజుల సమ్మె డిమాండ్ల హామీల
విస్మరణ
● కూటమి ప్రభుత్వంపై ఆ వర్గం నిప్పులు
కపిలేశ్వరపురం: ప్రభుత్వమంటే ప్రజలకు మేలు చేసేదయ్యుండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే అందులో సామాజిక పింఛన్లు తప్ప మిగిలినవేవీ అమలుకు నోచుకోలేదు. ప్రజల ఒత్తిడి నేపథ్యంలో తల్లికి వందనం ప్రారంభించినప్పటికీ అనేక మంది అర్హులు సాయం అందక గగ్గోలు పెడుతున్నారు. అంగన్వాడీ, ఆశ వర్కర్ల వంటి వారిని విధానపరంగా సంక్షేమ పథకాలకు దూరం పెట్టడంతో చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు అన్యాయం చేయడానికి తామేం పాపం చేశామంటూ ఆందోళన చెందుతున్నారు. సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు సైతం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్పై ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
సాంకేతికత పేరుతో పనిభారం
అనేక విభాగాల వారికి చేదోడువాదోడుగా ఉండే పనులకు వినియోగించుకోవాల్సిన అంగన్వాడీలపై సాంకేతికత పేరుతో కూటమి ప్రభుత్వం భారం మోపుతుంది. పోషకాహారాన్ని అందుకునే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను ఫేస్ యాప్లో నమోదు చేయాల్సి రావడం భారంగా ఉందని, యాప్ యాతనను తొలగించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి పోషణ ట్రాకర్ యాప్, బాల సంజీవిని యాప్లను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా 6 నెలలు నుంచి మూడేళ్లలోపు పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) అందిస్తున్నారు. ఆ రెండు యాప్లలో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటితో పాటు అధికారులు మరో 12 రకాల రికార్డులు రాయిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకుల ఫొటోలను తీసి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ అప్డేట్ కాకపోయినా, ఈకేవైసీ కాకపోయినా, ఆధార్ కార్డులో లబ్ధిదారుని ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోయినా వివరాలు యాప్లో నమోదు కావడంలేదు. అప్డేట్ వ్యవహారాలు సచివాలయానికి వెళ్లి సరిచేసుకోవాలని లబ్ధిదారులకు చెప్తున్నప్పటికీ వారు ఖాతరు చేయడంలేదు. దీంతో చేసేది లేక లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అంగన్వాడీలు పోషకాహారాన్ని అందించాల్సి వస్తోంది.
ఉద్యమాలపై ఉక్కుపాదం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని కూటమి నేతలు అప్పట్లో హామీ ఇచ్చారు. ఏడాది పాలనాకాలం గడిచినా హామీలో ప్రధానమైనదైన రూ.26 వేలకు జీతాలను పెంచాలన్న డిమాండ్ను పక్కన పెట్టారు. ఒక్క రూపాయి కూడా వేతనాన్ని పెంచలేదు. అంగన్వాడీ కార్యకర్త చనిపోయినప్పుడు రూ. 20 వేలు మట్టి ఖర్చులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో రూ.15 వేలు చెల్లించాలంటూ జీఓ జారీ చేశారు. రాష్ట్రంలోని 6,830 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలన్న డిమాండ్పైనా ఉలుకూ పలుకూ లేదు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. 2024 జూలై 10న కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వారు ర్యాలీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 10న ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫిబ్రవరి 17న ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాని ఆందోళనలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మార్చి 11న నిర్వహించిన చలో విజయవాడ ఆందోళనలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు పెద్ద ఎత్తున బయలుదేరారు. 10న సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లు, పలు బస్ స్టేషన్ల వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈనెల 23న ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించిన ధర్నాను నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ప్రయత్నం చేసి విఫలమైంది.
సంక్షేమ పథకాలకు
దూరం చేయొద్దు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, సుప్రీం కోర్టు చెప్పిన విధంగా కనీస వేతనాలను చెల్లించకుండా అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలకు అంగన్వాడీలను దూరం చేస్తోంది. అదే నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయదలిస్తే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ప్రతి సదుపాయాన్ని కల్పించడంతో పాటు వేతనాలను పెంచాలి. ఆందోళనలు చేస్తున్నప్పుడు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే సహించేది లేదు.
– జి.బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్
యూనియన్, కాకినాడ
ఉమ్మడిజిల్లాలో అంగన్వాడీలు ఇలా...
కాకినాడ జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,986 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1,05,996 మంది ప్రీస్కూల్ పిల్లలు, 11,610 మంది బాలింతలు, 10,573 మంది గర్భిణులకు అంగన్వాడీలు విశేష సేవలందిస్తున్నారు.
కోనసీమ జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలుండగా 86,296 మంది చిన్నారులు, 15,743 మంది గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్, 26 మినీ మొత్తం 1,562 అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులు సేవలందుకుంటున్నారు.

వందనానికి వంకలా!

వందనానికి వంకలా!