
320 కేజీల గంజాయి స్వాధీనం
దర్యాప్తు చేస్తున్న విశాఖ నార్కోటిక్స్ సిబ్బంది
కడియం: మండలంలోని కడియపులంక వద్ద లారీలో సుమారు 320 కేజీల గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్స్ బృందం స్వాధీనం చేసుకుంది. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్, క్లీనర్లను పోలీస్స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖకు చెందిన నార్కోటిక్స్ సూపరింటెండెంట్ రాజన్కుమార్, ఐదుగురు సిబ్బంది శుక్రవారం రాత్రి కడియపులంక వే బ్రిడ్జి వద్ద ఒక లారీని నిలిపివేసి పోలీసు స్టేషన్కు తరలించారు. లారీని క్షుణ్ణంగా పరిశీలించగా, డ్రైవర్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేబిన్లో ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయిని గుర్తించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నుంచి నార్కోటిక్స్ బృందం సంబంధిత వ్యక్తులను దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి కడియంలో ఉంటూ తన రాష్ట్రంలోని రైతులకు మొక్కలను సరఫరా చేస్తుంటాడు. పదేళ్లుగా ఇతను ఈ వ్యాపారంలో ఉన్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ట్రాన్స్పోర్టు కంపెనీ ద్వారా ఒక లారీని కిరాయికి మాట్లాడుకుని మొక్కలు లోడు చేసి పంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే సదరు లారీ గోధుల లోడు తీసుకు వచ్చి ఈనెల 25న హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న మిల్లులో దిగుమతి చేశాడు. అక్కడి నుంచి గోకవరం వెళ్లి గంజాయిని లోడు చేసుకుని, తిరిగి వెనక్కి వచ్చి మొక్కలు లోడు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న నార్కోటిక్స్ బృందం శుక్రవారం లారీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.