
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● 5 జిల్లాల్లో 19 కేసులు నమోదు
● రూ.65 లక్షల విలువైన
బంగారం స్వాధీనం
కాకినాడ క్రైం: రాత్రి వేళల్లో ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన 42 ఏళ్ల బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాసి శేఖర్, 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు ఐదు జిల్లాల్లో వారు చోరీలు చేశారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ పర్యవేక్షణలో సర్కిల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు వరుస చోరీలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో నిందితులు ముగ్గురినీ కాకినాడ రూరల్ పరిధిలో శుక్రవారం పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లు, తక్కువ సమయంలో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వీరు దొంగతనాలు చేస్తున్నారన్నారు. దర్యాప్తు బృందంతో పాటు కరప ఎస్ఐ సునీత, గొల్లపాలెం ఎస్ఐ మోహన్కుమార్, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.