
క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం
● విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులు
● రైతుల ద్వారా సాగుపై అవగాహన
● ఉద్యోగంలో చేరడంతోనే విధులకు
అంకితమయ్యేలా శిక్షణ
● ఈ విధానంతో ఎంతో ప్రయోజనం
అంటున్న అధికారులు
పిఠాపురం: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్న సామెత ఈ విద్యార్థులకు అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ పాఠాలు నేరుస్తున్న వారంతా నేరుగా పొలంబాట పట్టి సాగు పద్ధతులను అక్కడి రైతుల ద్వారా నేర్చుకుంటున్నారు. విద్య పూర్తయ్యి ఉద్యోగంలో చేరే నాటికి మళ్లీ అప్రెంటిస్, శిక్షణలు అనేవి అవసరం లేకుండా విధి నిర్వహణకు వారు సంసిద్ధంగా ఉంటారు. తరగతిలో కంటే క్షేత్రస్థాయిలో అభ్యసిస్తేనే ఈ శాస్త్రం అలవడుతుందని అధ్యాపకులు ఆ విద్యార్థులను పొలంబాట పట్టించారు. ప్రయోగాత్మకంగా సాగు పద్ధతులు వివరిస్తున్నారు. విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్ని ప్రక్రియలపైనా వారికి బోధిస్తున్నారు. ఇలా సాగు విధానాలు నేర్చుకుంటున్నది కాకినాడ ఐడియల్ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. ఒక్కో ఊరికి కొంత మంది చొప్పున పంపించి అక్కడి విధానాలను నేరుగా పొలాల్లోనే నేర్పుతున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు మండలం దుర్గాడలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నేరుగా వారితోనే మాట్లాడి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు.
ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక పాఠాలు
విద్యార్థులకు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను బ్యాచ్లుగా వివిధ గ్రామాలకు పంపి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులు నేర్పుతున్నారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి సాగు విధానాలు నేర్పుతున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం