
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం నుంచి రక్షించండి
అమలాపురం రూరల్: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కొత్తపాలేనికి చెందిన టీడీపీ కార్యకర్త కాలాడి అచ్చిబాబు, అతని కుటుంబ సభ్యులు మొల్లేటిమొగ గ్రామంలో తమపై దాడి చేసి తాటాకు ఇంటిని కూల్చేసి డబ్బు, బంగారం దోచుకున్నారని బాధితులు కాలాడి రామలక్ష్మి, సూరిబాబు దంపతులు వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని పేర్కొంటూ ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నకళ్లను శనివారం స్థానిక విలేకరులకు వారు అందజేశారు. గత నెల 26న తన భర్త చేపల చెరువు పట్టుబడికి వెళ్లిన సమయంలో అచ్చిబాబు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు 30 మంది వచ్చి తమపై దాడిచేసి ఇంటి కూల్చేసి తమను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తమ పాకను కూల్చిన స్థలంలో రేకుల షెడ్ నిర్మించారని, కుమార్తె పెళ్లి కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ.6.5 లక్షలు, ఐదు కాసులు బంగారాన్ని దోచుకున్నారని రామలక్ష్మి తెలిపారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. మొల్లేటిమోగలో 30 ఏళ్లుగా ఉంటున్నామని, తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలువ నీడ లేక సామాన్లు రోడ్డుపై ఉన్నాయని, కొన్ని సామాన్లు కాలువలో పడేశారని, తానూ, తమ కుమార్తెలు బట్టలు మార్చుకునే స్థలం లేకుండా చేశారని రామలక్ష్మి అవేదన వ్యక్తం చేశారు.
గుడిసె కూల్చి నిరాశ్రయులను చేశారు
బంగారం, రూ.6.5 లక్షలు దోచేశారు
కలెక్టర్, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు

టీడీపీ కార్యకర్త దౌర్జన్యం నుంచి రక్షించండి