
అంగన్వాడీ కార్యకర్త తొలగింపుపై నిరశన
● నాలుగు రోజులుగా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు
● అస్వస్థతకు గురైన బాధితురాలు పద్మ
● ఆసుపత్రికి తరలించిన సహచరులు
శంఖవరం: స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రంలో 12 ఏళ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్న ఎం.పద్మను అక్రమంగా తొలగించి అదే గ్రామానికి చెందిన బీసీ డీ కులానికి చెందిన పాకిలా భవానీని విధుల్లోకి చేర్చుకోవడం అన్యాయమని ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఈ నెల 17 నుంచి ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు పనిచేసిన అంగన్వాడీ కార్యకర్తకు నోటీస్, రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా మరొకరిని విధుల్లోకి ఎలా చేర్చుకుంటారంటూ నాలుగు రోజులుగా ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. బాధితురాలు పద్మ నాలుగు రోజులుగా ఆహారం సక్రమంగా తీసుకోకుండా శుక్రవారం దీక్షలో కూర్చుంది. దీక్షలో కూర్చున్న గంటలో తీవ్ర అస్వస్థకు గురైంది. ఆమెను 108 వాహనంలో అంగన్వాడీలు సీహెచ్సీకీ తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు.
అంగన్వాడీ కార్యకర్త పద్మకు పలువురి పరామర్శ
నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ కార్యకర్త ఎం.పద్మ అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం పలువురు పరామర్శించారు. జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు శేషు బాబ్జి చికిత్స పొందుతున్న పద్మను పరామర్శించి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అప్పటివరకు పని చేస్తున్న కార్యకర్తలనే కొనసాగించాలంటూ గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 4వ తేదీన ఉత్తర్వులు విడుదల చేసిందని, అయినా అధికారులు ఈ జీవోన దాచిపెట్టి, ఈ నెల 16న కోర్టు ఆర్డర్ ఉన్నదంటూ మరో ఆమెను విధుల్లోకి చేర్చుకోవడం ఆన్యాయమన్నారు. ఇప్పటికై నా అధికారులు పద్మను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు గెడ్డం బుల్లమ్మ, బి.రత్నకుమారి, డి.సత్యవేణి, నూకరత్నం, రాజేశ్వరి పాల్గొన్నారు.

అంగన్వాడీ కార్యకర్త తొలగింపుపై నిరశన