కొల్ల్లగొట్టేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

కొల్ల్లగొట్టేస్తున్నారు

May 31 2025 12:24 AM | Updated on May 31 2025 12:28 AM

తాళ్లపూడి (కొవ్వూరు): ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెడ్జర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి, తరలించుకుపోతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో సుమారు 20 ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో 7 ఓపెన్‌, 13 బోట్స్‌మెన్‌ సొసైటీ ర్యాంపులు ఉన్నాయి. పడవ ర్యాంపుల్లో కూలీలతో ఇసుక సేకరించి పడవల్లో ఒడ్డుకు తేవాలి. ఓపెన్‌ ర్యాంపుల్లో అయితే అసలు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంత తరలిస్తున్నారనే దానికి లెక్కా పత్రం లేకుండా పోతోంది. లారీలు, భారీ యత్రాలు, పైగా డ్రెడ్జర్లను సైతం ఉపయోగించి ఇసుక తవ్వేస్తున్నారు. పలుచోట్ల బోట్స్‌మెన్‌ సొసైటీల ముసుగులో సైతం డ్రెడ్జర్లతో ఇసుక తవ్వుతున్నారు. కుమారదేవం, చిడిపి, తాడిపూడి వద్ద ఆరు ఓపెన్‌ ర్యాంపులున్నాయి. ఇక్కడ నదీ గర్భంలోకి కిలోమీటర్ల మేర బాటలు వేసి మరీ, భారీ యంత్రాల ఉపయోగించి ఇసుక తవ్వి, లారీలతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అధికార కూటమి నేతల ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వదిలేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

తవ్వుకుపోతున్నారిలా..

ఫ కుమారదేవం వద్ద ఉన్న 3 ర్యాంపుల్లో భారీ యంత్రాలు వాడుతున్నారు. నదీ గర్భంలోకి 3 కిలోమీటర్ల మేర బాటలు వేసి మరీ ఇసుక తవ్వుతున్నారు.

ఫ తాడిపూడిలోని ఓపెన్‌ ర్యాంపుల నుంచి ఏలూరు జిల్లాలోని స్టాక్‌ పాయింట్‌కు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ భారీగా ఇసుక తవ్వేస్తూండటంతో గోదావరి నదీగర్భంలో పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. గత శివరాత్రి పుణ్యస్నానాలకు వెళ్లి ఇక్కడే ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు.

ఫ ఆరికిరేవుల వద్ద ఉన్న అన్ని ర్యాంపులు, కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి సమీపాన ఉన్న ర్యాంపుల్లో కూడా నిరంతరం డ్రెడ్జర్లతో ఇసుక తవ్వేస్తున్నారు. రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి వద్ద కూడా ఇదేవిధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. మిగిలిన ర్యాంపుల్లోనూ ఇదే తంతు. డ్రెడ్జర్లతో పడవల్లోకి ఇసుకను లోడ్‌ చేసి, యంత్రాలతో అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. రాత్రి వేళ మరిన్ని డ్రెడ్జర్లు వాడుతున్నారు. ఆరికిరేవుల ర్యాంపులో అయితే పట్టపగలే డ్రెడ్జర్లు ఉపయోగిస్తున్నారు. సెమీ మెకనైజ్డ్‌ పేరుతో భారీ యంత్రాలకు అనుమతి ఇవ్వచ్చా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఫ నిబంధనల ప్రకారం వంతెనలు, ఇతర నిర్మాణాలకు 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వరాదు. కానీ, ఆ నిబంధనను ఇసుక మాఫియా తుంగలో తొక్కేస్తోంది.

ఫ గతంలో బల్లిపాడు ర్యాంపులో ఇసుక తవ్వుతున్న ఓ డ్రెడ్జర్‌ను రాత్రి వేళ అధికారులు పట్టుకున్నారు. కానీ, ఇప్పుడు పట్టపగలే కళ్ల ముందు పదుల సంఖ్యలో డ్రెడ్జర్లతో తవ్వేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

ఫ స్టాక్‌ పాయింట్ల వద్ద కూడా భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు.

ఫ ఓపెన్‌ ర్యాంపుల్లో టన్ను ఇసుకను రూ.78 నుంచి రూ.90 వరకూ విక్రయించాల్సి ఉండగా రూ.160 నుంచి రూ.180 వరకూ వసూలు చేస్తున్నారు. యూనిట్‌ ఇసుకను రూ.700 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు.

గట్టుకు తూట్లు

కొత్తగా పలు ర్యాంపులకు అనుమతులు ఇవ్వడంతో వారు గోదావరి గట్టుకు ఇష్టానుసారం తూట్లు పొడిచి, బాటలు వేస్తున్నారు. దీంతో గోదావరి ఏటిగట్టుపై ప్రయాణాలంటేనే హడలెత్తే పరిస్థితి వచ్చింది. ర్యాంపులోంచి లారీలు అకస్మాత్తుగా రావడాన్ని కొందరు గమనించలేకపోతున్నారు. కొత్తగా వచ్చే వారికి ర్యాంపు ఎక్కడుందో తెలియడం లేదు. లంకలకు సైతం ఇష్టారాజ్యంగా తూట్లు పొడుస్తున్నారు. నిరంతరం అధిక లోడుతో ఇసుక లారీలు కళ్ల ముందే వెళ్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఇసుక జారిపడుతోంది. గోదావరి ఏటిగట్టు రోడ్డుకు ఆనుకుని స్టాక్‌ పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే వాహనాలు జారిపోయి, గాయపడుతున్నారు. మరోవైపు కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత ర్యాంపుల్లో నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాడిపూడి ర్యాంపును గురువారం తనిఖీ చేశారు. సెమీ మెకనైజ్ట్‌ యంత్రాలకు అనుమతులున్నట్లు తెలిపారు. ఇసుక అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ, అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిస్తూనే ఉన్నారు.

రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి వద్ద ఇసుక ర్యాంపు

ఫ గోదారి గర్భంలో డ్రెడ్జర్లతో

యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

ఫ భారీ యంత్రాలతో లోడింగ్‌

ఫ ర్యాంపుల నుంచి తరలిస్తున్న

ఇసుకకు లెక్కే లేదు

ఉచిత ఇసుక ముసుగులో దోపిడీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. నియోజకవర్గంలోని ర్యాంపుల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. భారీ యంత్రాలు, డ్రెడ్జర్లతో ఇసుక కొల్లగొడుతున్నారు. ఏటిగట్టు పొడవునా ఎక్కడ పడితే అక్కడ ఇసుక స్టాక్‌ చేస్తున్నారు. దీనివలన గట్టు పాడవుతుంది.

– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌, కొవ్వూరు

పర్యావరణ అనుమతులున్నాయా?

గోదావరిలో ఇసుక తవ్వకాలకు అసలు పర్యావరణ అనుమతులున్నాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలతో గోదావరిలో లోతైన గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో లేని అనుమతులు ఇప్పుడెలా వచ్చాయి? ఇకనైనా నిబంధనలు పాటించాలి.

– పిట్టా శ్రీనివాస్‌, వైఎస్సార్‌ సీపీ దళిత జేఏసీ నాయకుడు, అన్నదేవరపేట

కొల్ల్లగొట్టేస్తున్నారు1
1/4

కొల్ల్లగొట్టేస్తున్నారు

కొల్ల్లగొట్టేస్తున్నారు2
2/4

కొల్ల్లగొట్టేస్తున్నారు

కొల్ల్లగొట్టేస్తున్నారు3
3/4

కొల్ల్లగొట్టేస్తున్నారు

కొల్ల్లగొట్టేస్తున్నారు4
4/4

కొల్ల్లగొట్టేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement